KTR | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-రేస్ కేసులో ప్రభుత్వం తనపై చేస్తున్నది ఉద్దేశపూర్వక, నిరాధారమైన నిందారోపణలే తప్ప, నిజాలు ఎంతమాత్రం లేవని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. సర్కార్ మోపిన అబద్ధాలను తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. ఫార్ములా ఈ-రేస్పై ప్రభుత్వం చేస్తున్న వాదనను తిరస్కరించారు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై ఆయన హైకోర్టులో కౌంటర్ దాఖలు దాఖలు చేశారు. తనపై సర్కారు చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజంలేదని కౌంటర్లో బదులిచ్చారు. ఫార్ములా ఈ-రేస్ సీజన్-10 నిర్వహణకు స్పాన్సర్ లేకపోవడం వల్లే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ‘ఈ మొత్తం వ్యవహారంలో కుట్ర లేదు. అవినీతి అంతా కన్నా లేదు. చట్ట పరిధిలోనే నిర్ణయం తీసుకున్నాను. హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచడం కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఫార్ములా ఈ-రేస్ మరో సీజన్ను కూడా హైదరాబాద్లో నిర్వహించడానికి తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం మాత్రమే’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈసీ తరుఫున వకాల్తా ఎందుకు?
ఫార్ములా ఈ-రేస్కు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న వాదన అర్థరహితమని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించారన్న ప్రభుత్వ వాదనను తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగితే ఎలక్షన్ కమిషన్ నోటీస్లు ఇవ్వాలి. అది ఇప్పటివరకు జరగలేదు. ఎలక్షన్ కమిషన్ తరుపున మీరు ఎందుకు వకాల్తా పుచ్చుకున్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ-రేస్ వలన రాష్ట్రానికి రూ.700 కోట్ల ప్రయోజనం చేకూరిందని నీల్సన్ రిపోర్ట్ పేర్కొన్న విషయాన్ని ఉదహరించారు. ఫార్ములా ఈ-రేస్ చేజారిపోకూడదనే ఉద్దేశంతో రూ.54 కోట్ల చెల్లింపులను గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన శాఖ చేసిందని వివరించారు. చెల్లింపులు అక్రమం కాదని పునరుద్ఘాటించారు. అయితే, రూ.54 కోట్లు 600 కోట్లు ఎట్లా అయ్యాయి? ఆ లెక ఇప్పటివరకు తమకు కనిపించలేదని పేర్కొన్నారు. అది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ అని చెప్పారు. ఫార్ములా ఈ-రేస్లో మొత్తం రూ.600 కోట్ల అవినీతి జరిగిందంటూ ఊకదంపుడుగా, ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రూ.600 కోట్ల అవినీతి అని తన మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆ సంస్థ మీద కేసు ఎందుకు వేయలేదు?
హెచ్ఎండీఏ అధికారాలకు లోబడే రూ.54 కోట్లు చెల్లింపులు ఫార్ములా- ఈ రేస్ నిర్వహణ సంస్థకు బదిలీ జరిగిందని కేటీఆర్ స్పష్టంచేశారు. ప్రభుత్వం చెప్పే రూ.8 కోట్లు ట్యాక్స్ రిటర్న్స్ మాత్రమేనని, స్పాన్సర్ ఆ పన్నును భర్తీ చేస్తారని తెలిపారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా చెల్లింపులు అన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని తెలిపారు. ‘రూ.54 కోట్లు ఫార్ములా ఈ-రేస్ నిర్వహకులకు ఇచ్చినప్పుడు, ఒకవేళ మీరన్నట్టు అవినీతి జరిగితే మరి ఫార్ములా ఈ-రేస్ సంస్థ మీద కేసు ఎందుకు వేయలేదు? ఇప్పటివరకు నాకు రూపాయి కూడా ముట్టినట్టు మీరు చూపించలేకపోయారు. ఇవి కక్షపూరిత ఆరోపణలే కానీ నేరం జరిగిందని చెప్పే రుజువులు కాదు. ఫార్ములా ఈ-రేస్ వల్ల ఒకవేళ నష్టం జరిగితే అది కేవలం రేవంత్రెడ్డి అర్ధరహిత నిర్ణయాలు, అనాలోచిత పనుల వల్ల మాత్రమే జరిగింది’ అని కేటీఆర్ దాఖ లు చేసిన కౌంటర్లో స్పష్టంచేశారు.