హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు.. ‘రోజ్గార్ మేళా’ పేరుతో 10 లక్షల ఉద్యోగాల నియామకమంటూ ప్రధాని మోదీ నిరుద్యోగ యువతను మభ్యపెట్టే కొత్త వంచనకు తెరతీశారని చెప్పారు. నిరుద్యోగులతో పరిహాసమాడటం మాని ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. హిమాచల్ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ముందు రోజ్గార్ మేళాతో మోదీ కొత్త డ్రామా ప్రారంభించారని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ఘాటైన బహిరంగ లేఖ రాశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల భర్తీ అని చెప్పి, 10 లక్షలకు కుదించారన్నారు. తెలంగాణలో 2.24 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, సుమారు 16.5 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని గుర్తుచేశారు.
మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ సారాంశం.. మీరు చేపట్టిన ‘రోజ్గార్’ మేళాతో దేశ యువత సంతోషం ఎకువ రోజులు ఉండేది కాదని అర్థమైంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు నింపుతామని ప్రకటించి 8 ఏండ్లలో 16 కోట్ల ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఆశతో ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొన్నది. నిరుద్యోగుల ఆశలపై రోజ్గార్ మేళా పేరుతో ఆటలాడటం సరైన చర్య కాదు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పిన మీరు, ఇప్పుడు ఆ సంఖ్యను 10 లక్షలకు కుదించారు. కేవలం 75 వేలమందికి నియామకపత్రాలు అందజేసి, ఆర్థిక వ్యవస్థ అనేక కష్టాల్లో ఉన్నదంటూ మీరు చేసిన వ్యాఖ్యలు, ఈ రోజ్గార్ హామీ మీద అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మీ పరిపాలనావైఫల్యం, అడ్డగోలు ఆర్థిక విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ నేలచూపులు చూస్తున్నదనే విషయం మీకు గుర్తు చేస్తున్నా. కోట్ల ఉద్యోగాల హామీ ఇచ్చి, కేవలం వేల ఉద్యోగాలతో మీరు చేస్తున్న మీడియా ప్రచారం, పదేపదే నిరుద్యోగ యువతతో పరిహాసం ఆడుతున్నట్టున్నది. ఉద్యోగాల భర్తీపై, దేశవ్యాప్తంగా ఖాళీలు నింపాలని, యువతకు ఉపాధి కల్పించాలని 9 జూన్ 2022న మీకో బహిరంగ లేఖ రాశా. దానికి మీ నుంచి సమాధానం లేదు. మీరు చేస్తున్న ఈ రోజ్గార్ మోసం ‘బాత్ కరోడోమే.. కామ్ పకోడోమే’ అన్న తీరుగా ఉన్నది. ఇలా చేయడం వల్ల.. నమో అంటే నమ్మించి మోసం చేయడం అని రుజువు అయ్యింది. ఇంకా కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురాదలిచాను.
మీరు చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాల పందేరంతో సుమారు 2.5 లక్షల మంది ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగాలు కోల్పోయారు. ప్రభుత్వ రంగ సంస్థలో సుమారు 50% ఉన్న రిజర్వుడ్ క్యాటగిరీలకు చెందిన వారికి భవిష్యత్తులోనూ శాశ్వతంగా ఉద్యోగావకాశాలు దొరకకుండా పోతున్నాయి.
లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ లాభాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ, కార్పొరేట్లకు కట్టబెడుతున్నది మీ ప్రభుత్వం. ఓ వైపు ఉద్యోగాలు తొలగిస్తూ తిరిగి ఉద్యోగ మేళా అంటే నోటితో నవ్వుతూ నోసటితో వెకిరించడం కాదా?