సిరిసిల్ల రూరల్, మార్చి 11: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పదోతరగతి విద్యార్థులకు చిరుకానుక అందజేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేయనున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యార్థులకు అందజేస్తున్నారు. మంగళవారం నియోజక వర్గంలోని సిరిసిల్ల పట్టణం, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డి పేట, వీర్ణపల్లి, గంభిరావుపేట, మూస్తాబాద్లోని ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్లలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు అందివ్వనున్నారు.
దీనికోసం పార్టీ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు పంపిణీకి తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులు, ఉపాద్యాయులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారని, పరీక్ష రాయబోతున్న పదో తరగతి విద్యార్థులకు శుభా కాంక్షలు తెలిపినట్లు పార్టీ నేతలు తెలిపారు.