వడోదర: తనను తానే పెళ్లి చేసుకుంటానని చెప్పిన 24 ఏళ్ల క్షమా బిందు ఆ ఘట్టాన్ని పూర్తి చేసింది. తనను తానే పెళ్లాడేసుకున్నది. మూహుర్తాని కన్నా రెండు రోజుల ముందే మనువాడేసింది. నిజానికి ఆమె జూన్ 11వ తేదీని పెళ్లి చేసుకోవాలనుకున్నది. కానీ 9వ తేదీనే ఆ తంతును ముగించేసింది. అయితే పెళ్లిలో భాగంగా జరిగే అన్ని వేడుకల్ని ఆమె నిర్వహించింది. హల్దీ, మెహిందీ లాంటి సాంప్రదాయ పెళ్లి వేడుకల్ని తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో జరుపుకున్నది. 40 నిమిషాల పాటు మ్యారేజ్ సెర్మనీ జరిగింది.
పెళ్లి కుమారుడు లేకుండానే ఈ వేడుక జరగడం ప్రత్యేకం. గుజరాత్లో సోలోగమీ పెళ్లి చేసుకున్న తొలి యువతిగా బిందు నిలిచింది. ఈ పెళ్లికి పూజారులు కూడా లేరు. తనను తానే పెళ్లి చేసుకోవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఇతర పెళ్లి కూతుళ్ల తరహాలో తనకు అప్పగింతలు అంటూ ఏమీ లేవని చెప్పింది. వెడ్డింగ్కు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో పోస్టు చేసింది.
తనకు తనతోనే పవిత్ర బంధం ఏర్పడినట్లు హల్దీ సెర్మనీ ఫోటోలకు ట్యాగ్లైన్ జోడించింది. రెండు వారాల పాటు గోవాకు హనీమూన్ ట్రిప్ వెళ్లేందుకు బిందు పేరెంట్స్ అనుమతి కూడా ఇచ్చారు.