హైదరాబాద్ : కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి వాటాలు కేటాయించే వరకు గెజిట్ నోటిఫికేషన్ను ఆపాలని కేఆర్ఎంబీని కోరామని తెలంగాణ నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని జలసౌధలో మంగళవారం జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో పాల్గొన్నారు. బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యతన జరిగిన సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రజత్కుమార్ బోర్డుకు రాష్ట్రం అభ్యంతరాలు తెలిపామన్నారు.
కృష్ణా పరిధిలో 65 కేంద్రాలు గెజిట్ నోటిఫికేషన్లో ఉన్నాయని వివరించారు. నాగార్జున సాగర్పై 18, శ్రీశైలంపై 12 కేంద్రాలివ్వాలని బోర్డు ప్రతిపాదించిందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరిందని, దీనిపై తాము అభ్యంతరం తెలిపామన్నారు. తమకు విద్యుత్ ఉత్పత్తి చాలా అవసరమని చెప్పామని పేర్కొన్నారు. ప్రాజెక్టు యాజమాన్య హక్కుల విషయమై న్యాయ సలహా అడిగామన్నారు.