వెల్గటూర్, డిసెంబర్ 28 : జగిత్యాల జిల్లాలో ఏడాదికి 8 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమను స్థాపించనున్నట్టు క్రిభ్కో కంపెనీ చైర్మన్ డాక్టర్ చంద్రపాల్సింగ్ తెలిపారు. మంగళవారం ఆయన ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ రవితో కలిసి వెల్గటూర్ మండలం స్తంభంపల్లి శివారులోని సర్వే నంబర్ 1091లో పరిశ్రమ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కంపెనీ విస్తరణలో భాగంగా జగిత్యాల జిల్లాలో పరిశ్రమను ఏర్పా టు చేస్తున్నామని తెలిపారు. తమకు ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ సహకారం బాగున్నదని చెప్పారు. అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయడం అదృష్టమన్నారు. ధర్మపురి ప్రాంతంలో ఓ పరిశ్రమను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కోరిన వెంటనే స్పందించారని తెలిపారు.
ఈ ప్రాంతంలో భారీగా వరి ఉత్పత్తి అవుతున్నందున.. అందుకు అనుగుణంగా ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి క్రిభ్కో కంపెనీ ప్రతినిధులను ఒప్పించారని చెప్పారు. ధర్మపురి ప్రాంతంలో ఇథనాల్ పరిశ్రమను సుమారు రూ.700 కోట్లతో ప్రభుత్వం ఏర్పా టు చేస్తున్నదని చెప్పారు. ఏడాదికి సుమారు 2 లక్షల టన్నుల వరి ధాన్యంతోపాటు మక్కలు, నూకలు అవసరం ఉంటుందన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో వరి పండిస్తున్న ఇక్కడి రైతాంగానికి ఇథనాల్ పరిశ్రమ వల్ల మేలు చేకూరుతుందని చెప్పారు. దీనికితోడు ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. పరిశ్రమ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, కంపెనీ ఏర్పాటుకు సహకరించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు.