హైదరాబాద్, జనవరి 4 : జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని స్తంభంపల్లిలో ఇథనాల్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు టీఎస్ఐఐసీ అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత స్థలంలోని గుట్టబోరును చదును చేయించేందుకు రూ.13 కోట్లు మంజూరుచేస్తున్నట్టు ప్రకటించారు. భూసేకరణలో ఇబ్బందులుంటే వెంటనే పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. క్రిషక్ భారతీ కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్కో), రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేయనున్న ఇథనాల్ ప్లాంటుపై మంత్రి కేటీఆర్ మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా, క్రిభ్కో రాష్ట్ర ఇంచార్జి రాంరెడ్డి తదితరులతో చర్చించారు.
అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకే తలమానికంగా నిలువనున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఏటా 8 కోట్ల లీటర్ల సామర్థ్యంతో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని, క్రిభ్కో సైతం పూర్తిస్థాయి అంగీకారం తెలిపిందని వివరించారు. దీనిని స్తంభంపల్లిలోని 100 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.700 కోట్లతో నిర్మించనున్నారు. ఇథనాల్ తయారీ కోసం ఏడాదికి 6 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు, మక్కలను వినియోగిస్తారని అంచనా. ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ ప్లాంటుతో జగిత్యాల జిల్లా స్వరూపమే మారిపోనున్నది. ఫ్యాక్టరీ ప్రతిపాదిత స్థలాన్ని గత నెల 28న మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి క్రిభ్కో చైర్మన్ డాక్టర్ చంద్రపాల్సింగ్, వైస్ చైర్మన్ సునీల్ కుమార్సింగ్, డైరెక్టర్లు పరిశీలించి, సంసిద్ధత వ్యక్తం చేశారు.