చేర్యాల, మార్చి 16 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో గణనీయంగా ఆదాయం పెరుగుతుండడంతో ఆలయవర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మల్లన్న క్షేత్రాభివృద్ధికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి ఆలయ అధికారులకు, కమిటీ చైర్మన్, సభ్యులకు ప్రత్యేక సూచనలు, ఆదేశాలు ఇస్తుండడంతో భక్తులకు వసతులు కలగడంతో పాటు ఆదాయం సైతం పెరుగుతున్నది. భక్తుల ఆదరణతో రోజురోజుకూ కోరమీసాల మల్లన్న స్వామి కాసుల వర్షం కురుస్తున్నది. స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు, హుండీ ద్వారా ఆదాయం స్వామి వారి ఖజానాకు సమకూరుతుండడంతో భక్తులు మరిన్ని వసతులు కల్పిస్తున్నారు. గతంలో భక్తులు కేవలం బ్రహ్మోత్సవాల సమయంలోనే కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి వచ్చి మొక్కులు చెల్లించుకునే వారు. ప్రస్తుతం 365 రోజుల్లో ప్రతీ ఆదివారం ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇటు బ్రహ్మోత్సవాల సమయంతో పాటు మిగిలిని ఆదివారాల్లో స్వామి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతున్నది. డిసెంబర్ 26న మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవం జరిగినప్పటి నుంచి 9వ ఆదివారం వరకు రూ.7,19,48,944 ఆదాయం వచ్చింది. అందులో 9 ఆదివారాల్లో రూ. 4,03,91,425 స్వామి వారి ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయం ద్వారా అందించే సేవలు ఆర్జీత సేవలు(గదులు, ప్రసాదాల కొనుగోలు, కల్యాణోత్సవ నిర్వహణ మొక్కులు, ముఖమండపం, నజరు, చిలుక పట్నం, తలనీలాల సమర్పణ,అభిషేకం, పట్నం తదితర) వాటి ద్వారా ఆదాయం వచ్చింది. హుండీ లెక్కింపుల ద్వారా రూ.3,15,57,519 ఆదా యం సమకూరింది.
స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంలోని పట్నం వారం ఆదాయం రూ.45,35,656, లష్కర్ వారం రూ.40,89,726, మూడో ఆదివారం రూ.41,78,794, నాల్గో ఆదివారం రూ.42,55,602, 5వ ఆదివారం రూ.36,38,606, 6వ ఆదివారం రూ.28,55,262, 7వ ఆదివారం రూ.42,71,687, 8వ ఆదివారం రూ.54,81,135, 9వ ఆదివారం రూ.51,57,977 ఆదాయం వచ్చింది. అలాగే మహా శివరాత్రి రోజున ఆర్జిత సేవల ద్వారా రూ.19,26,980 సమకూరింది. స్వామి వారి కల్యాణోత్సవంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయవర్గాలు హుండీలను మూడుసార్లు తెరిచి, నగదు లెక్కించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడుసార్లు లెక్కిస్తే, రెండుసార్లు ఆదాయం కోటి దాటింది. జనవరి 11న జరిగిన లెక్కింపులో రూ.1,03,92,693, ఫిబ్రవరి 5న రూ.99,16,834, మార్చి 4న హుండీ లెక్కింపుల్లో రూ.1,12,47,992 ఆదాయం స్వామి వారి ఖజానాకు సమకూరింది.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు ఆలయ ధర్మకర్తల మండలి బాధ్యతగా పని చేస్తున్నాం. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం నుంచి కమిటీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండడంతో భక్తులు సకాలంలో దర్శనం చేసుకుంటున్నారు. దీంతో భక్తులు సంతోషంగా హుండీల్లో కానుకలు వేయడంతో పాటు మొక్కులు చెల్లించుకోవడంతో ఆదాయం సైతం పెరుగుతున్నది. భక్తుల సేవే లక్ష్యంగా ఆలయ కమిటీ పని చేస్తున్నది. అన్నప్రసాద వితరణశాలకు భారీగా విరాళాలు వస్తున్నాయి.
– గీస భిక్షపతి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, కొమురవెల్లి
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదాయం పెరుగుతున్నది. రానున్న రోజుల్లో మరింత ఆదాయం పెరిగే అవకాశముంది. భక్తులకు కావాల్సిన వసతులు కల్పించేందుకు ధర్మకర్తల మండలి, ఏఈవోలు, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు కృషి చేస్తుండడంతో ఆదాయం గణనీయంగా పెరుగుతున్నది. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి, భక్తులకు మరిన్ని వసతులు కల్పించడమే మా లక్ష్యం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్రంలో సేవలు అందిస్తున్నాం.
– ఆలూరి బాలాజీ, ఆలయ ఈవో, కొమురవెల్లి