అండర్ గ్రౌండ్ ద్వారా కరెంట్ కేబుల్
వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతలు
మురికి నీటి బాక్సులపై 10.55 కిలో మీటర్ల వాకింగ్ ట్రాక్
6 నుంచి 36 మీటర్ల వెడల్పు గల 13.50 కి.మీ. నిడివితో రోడ్డు
గూడు లేని నిరుపేద కుటుంబాలకు చక్కటి సౌలత్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం గ్రేటర్లో చురుగ్గా పూర్తవుతోంది. నగరంలో ఇప్పటికే వేలాది ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించారు. ఇండ్ల నిర్మాణంలో మెగా ప్రాజెక్టుగా పేరొందిన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో నిర్మించిన అతిపెద్ద గృహ సముదాయం వచ్చేనెలలో అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందజేసి గృహ ప్రవేశాలు చేయించనున్నారు. ఔటర్ రింగ్రోడ్డును ఆనుకొని సుమారు 145 ఎకరాల విస్తీర్ణంలో చూడచక్కగా నిర్మించిన ఈ భారీ గృహ సముదాయం కార్పొరేట్ అపార్ట్మెంట్లను తలదన్నేలా ఆకట్టుకుంటోంది.
సిటీబ్యూరో, జనవరి 27(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన, పేద వర్గాల అభ్యున్నతి కోసం, వారు ఆత్మ గౌరవంగా బతికేలా వారికో గూడును కల్పిస్తూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ మహా నగరంలో ఎప్పటికీ నెరవేరని సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేస్తున్నది. అందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తున్నది. ఇప్పటికే నగరంలో పలు చోట్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నారు.