న్యూఢిల్లీ: జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ల్లో సత్తా చాటాలనుకుంటే.. ఇప్పటికిప్పుడు ఐపీఎల్ నుంచి విరాట్ కోహ్లీ వైదొలుగాలని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి సూచించాడు. ఐపీఎల్ నుంచి వైదొలిగి విశ్రాంతి తీసుకోవాలని పేర్కొన్నాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత కోహ్లీకి విశ్రాంతినివ్వాలని ఇటీవల చెప్పిన రవిశాస్త్రి తాజాగా ఐపీఎల్ నుంచే వైదొలుగాలని పేర్కొన్నాడు. ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో శాస్త్రి బుధవారం మాట్లాడుతూ.. ‘కొన్నేండ్లుగా అన్ని ఫార్మాట్లకు సారథ్యం వహించిన కోహ్లీ నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. అతడికి విరామం చాలా అవసరం.
ఈ ఏడాది తను ఐపీఎల్ ఆడుతున్నాడు. అయితే అంతర్జాతీయంగా మరో ఆరేడేండ్లు కోహ్లీ తన సత్తా చాటాలనుకుంటే ఐపీఎల్ నుంచి వైదొలుగడమే మంచిది. ఇది తనొక్కడికే కాదు. మిగతా ఆటగాళ్లకు కూడా ఇదే చెబుతా’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ కోహ్లీ తాజా సీజన్లో బ్యాట్ ఝుళిపించడంలో విఫలమవుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో గోల్డెన్ డకౌట్ కాగా.. రాజస్థాన్తో మ్యాచ్లో కేవలం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ ప్రదర్శనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విధంగా ఆడితే భవిష్యత్ టోర్నీలకు రన్మిషన్ కోహ్లీ ఎంపికవడం కష్టమనే వాదన వినిపిస్తున్నది.