కరాచీ: ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉన్నారు. పాకిస్థాన్లోనూ అతన్ని ఫాలోఅవుతున్న ఫ్యాన్స్ కోకొల్లలు. కోహ్లీ ఇప్పటి వరకు 102 టెస్టులు, 262 వన్డేలు, 108 టీ20 మ్యాచ్లు ఆడాడు. వాటిల్లో మొత్తం కలిపి 71 సెంచరీలు కూడా చేశాడు. అన్ని విదేశీ టూర్లలోనూ అతను సెంచరీ చేశాడు. కానీ ఒక్క పాకిస్థాన్లో మాత్రం అతను ఇప్పటి వరకు ఆడలేదు. పాకిస్థాన్లో చివరిసారి 2006లో భారత్ టూర్ చేసింది. ఆ సమయంలో కోహ్లీ ఇండియన్ జట్టులో లేడు. ఇక రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తత నేపథ్యంలో.. ద్వైపాక్షిక సిరీస్లు జరగడంలేదు. ఈ నేపథ్యంలో కోహ్లీ అభిమాని ఒకరు పాకిస్థాన్లో తన కోరికను బయటపెట్టాడు. ఇంగ్లండ్, పాక్ మధ్య జరిగిన ఆరవ టీ20 మ్యాచ్ సమయంలో ఓ ప్లకార్డును ప్రదర్శించాడు. రిటైర్ కావడానికి ముందే.. కోహ్లీ పాక్లో ఆడాలని ఆ ప్లకార్డుపై రాశాడు. పాక్లో కోహ్లీ ఆడకున్నా.. అక్కడ అతనికి ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారు. ఓ అభిమాని శుక్రవారం ఇలా ప్లకార్డుతో అందర్నీ ఆకట్టుకున్నాడు. సచిన్తో పాటు ధోనీ, కోహ్లీలకు పాక్లో ఫ్యాన్స్ బోలెడుమంది ఉన్నారు.