Kohli on AB de Villiers Retirement | ఐపీఎల్లో మరో శకం ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. గతంలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన ఏబీడీ.. ఐపీఎల్ వంటి లీగ్లు ఆడుతున్నాడు. తాజాగా వీటి నుంచి కూడా వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీనిపై ఆర్సీబీ జట్టులో అతని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు.
‘మన తరంలో ఉత్తమ ఆటగాడు, నేను కలిసిన వారిలో అందరికన్నా స్ఫూర్తిమంతమైన వ్యక్తి. నువ్వు ఇప్పటి వరకూ సాధించిన విజయాలు, ఆర్సీబీకి నువ్వు చేసిన సేవ చూసి నువ్వు గర్వించాలి బ్రదర్. మన బంధం ఆటను ఎప్పుడో దాటేసింది. ఎప్పటికీ అలాగే ఉంటుంది కూడా’ అని చెప్పాడు.
అలాగే రిటైర్ అవ్వాలనే ఏబీడీ నిర్ణయం గురించి కూడా ప్రస్తావించాడు. ‘ఈ నిర్ణయం నా మనసుకు చాలా బాధ కలిగిస్తోంది. కానీ ఎప్పట్లాగే నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటావని నాకు తెలుసు. ఐ లవ్ యూ’ అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు.
దీనికి స్పందించిన డివిలియర్స్.. ‘లవ్ యూ టూ మై బ్రదర్’ (నువ్వంటే నాక్కూడా ఇష్టమే సోదరా) అని రిప్లై ఇచ్చాడు. వీరిద్దరూ కలిసి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చాలా ఏళ్లుగా ఆడారు. ఈ టోర్నీలో పదిసార్లు 100పైగా భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు ఈ జోడీ పేరిటే ఉంది.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం రికార్డు కూడా వీరి పేరిటే ఉంది. 2016లో కొత్త జట్టు గుజరాత్ లయన్స్పై రెండో వికెట్కు 229 పరుగులు చేసిన వీళ్లు.. అంతకుముందు సంవత్సరంలో ముంబై ఇండియన్స్పై 215 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.