తిరుపతి : తిరుపతి కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ (TTD) ఆగమ సలహాదారు, కంకణబట్టార్ సీతారామాచార్యులు ఆధ్వర్యంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతో పాటు సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు.
అంతకుముందు సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం కోదండరామస్వామి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్స్వామి, డిప్యూటీ ఈవోలు గోవిందరాజన్, నాగరత్న, ఏఈవో పార్థసారధి, సూపరింటెండెంట్ సోమశేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.