Pathipaka Mohan | బాలల కోసం రాసేది బాలసాహిత్యం. గడచిన కొన్నేండ్లుగా బాల సాహిత్యం విరివిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందరో రచయితలు బాల సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. అలాంటివారిలో డాక్టర్ పత్తిపాక మోహన్ ఒకరు. ప్రస్తుతం నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తెలుగు సంపాదకులుగా ఉన్న ఆయన రాసిన ‘బాలల తాత బాపూజీ’ అనే గేయకథను కేంద్ర సాహిత్య అకాడమీ ఈ ఏడాదికి బాల సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసింది. నవంబర్ 14న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పురస్కారం అందుకుంటున్న సందర్భంగా మోహన్తో ప్రత్యేక సంభాషణ.
మాది పూర్వపు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. నేను చందుర్తి మండలం లింగంపేటలో అమ్మమ్మ వాళ్లింట్లో పుట్టాను. నా ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు స్వగ్రామం సిరిసిల్ల, అగ్రహారంలలోసాగింది. మాది చేనేత కుటుంబం. మా నాన్న పవర్లూం వ్యాపారం చేసేవారు. రెండుసార్లు పురపాలక సంఘం కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. వివిధ పదవులు అలంకరించారు. చేనేత కుటుంబంలో పుట్టడం వల్ల ఆ నేపథ్యంలో అనేక కవితలు రాశాను. ఓనమాలు నేర్చుకోవడానికి ముందే నేను వేమన పద్యాలు, కబీరు దోహాలు నేర్చుకున్నాను. దీనికి కారణం మా తాత శంకరయ్య. ఆయనతో నాకు అనుబంధం ఎక్కువ. ఒడిలో కూర్చోబెట్టుకుని పద్యాలు నేర్పించేవారు. ఇక నాకు పుస్తకాలు పరిచయం చేసింది మా మేనత్త ఇందిరాబాయి. పోలియో కారణంగా ఎక్కడికీ కదిలేది కాదు కానీ, అన్నిరకాల తెలుగు పుస్తకాలు, చందమామ వంటి పత్రికలు తెప్పించుకునేది. చందమామ ప్రారంభ సంచిక కూడా చూసిందట. సాయంత్రం బడి నుంచి వచ్చిన వెంటనే ఆమె దగ్గరికి వెళ్లేవాణ్ని. చందమామ కథలు, పత్రికలు చదివేవాణ్ని. యద్దనపూడి సులోచనారాణి నవలలు, సినిమా కథలు మా అత్త చదివి వినిపించేది. ఆవిడ దగ్గర ఎన్నో కొత్తవిషయాలు నేర్చుకున్నాను.
నా తొలి కవిత ఏడో తరగతిలో రాశాను. అది కూడా ఓటు గురించి. ఆ తర్వాత అనేక అంశాల మీద కవిత్వం రాస్తూ వచ్చాను. ఇంటర్మీడియట్లో జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డితో పరిచయం నా సాహితీ జీవితాన్ని కొంతపుంతలు తొక్కించింది. ఆయనతో సభలు, సమావేశాల్లో పాల్గొనే అవకాశం లభించింది. చిన్న వయసులోనే అనేక సాహిత్య సభలకు వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం కలిగింది. శ్రీశ్రీ మహాప్రస్థానం, అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం అప్పుడే పరిచయమైంది. పుస్తకాలు విరివిగా చదివేవాణ్ని. ఆ రోజుల్లోనే ‘కవిత్వం’ పేరుతో ఒక లిఖిత పత్రిక కూడా నడిపిన అనుభవం ఉంది. సినారె స్ఫూర్తితో, ఎలగొండ రవి తదితరులతో కలిసి 1989లో మానేరు రచయితల సంఘం స్థాపించాం. పీజీ కోసం ఉస్మానియాకు రావడం నా సాహితీ ప్రపంచాన్ని విస్తృత పరిచింది. తెలంగాణ ఉద్యమంతో పరిచయం నన్ను మరింత ఉత్సాహపరిచింది. ఆ తర్వాత సిర్పూర్ కాగజ్నగర్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల-కళాశాలలో తెలుగు రెసిడెంట్ టీచర్గా పనిచేశాను. ఆచార్య తంగెడ కిషన్రావు పర్యవేక్షణలో 2001లో ‘తెలుగులో గజల్ ప్రక్రియ-సమగ్ర పరిశీలన’ పేరుతో తెలుగు గజల్పై తొలి పరిశోధన చేశాను. తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నాగారంలో తెలుగు పండితునిగా ఉద్యోగం చేశాను. ఆ తర్వాత సిరిసిల్లలో కొంతకాలం వ్యాపారం కూడా చేశాను. అంతలోనే భారత ప్రభుత్వం అధీనంలో పనిచేసే ప్రచురణ సంస్థ నేషనల్ బుక్ట్రస్ట్లో అసిస్టెంట్ ఎడిటర్గా అవకాశం వచ్చింది. ప్రస్తుతం అందులోనే తెలుగు సహాయ సంపాదకునిగా ఉద్యోగం చేస్తున్నాను.
కుటుంబం విషయానికొస్తే నా జీవన సహచరి సిరిసిల్ల చందన. హిందీ ఉపాధ్యాయిని. మా పెళ్లి కూడా నారాయణ రెడ్డిగారే జరిపించారు. మాకు ఇద్దరు పిల్లలు. టీచర్గా పిల్లలతో కలిసి పనిచేస్తుండటం వల్ల వారికోసం రాయాలనే ఆలోచన కలిగింది. అలా బాలసాహిత్యం వైపు అడుగులు పడ్డాయి. తిరునగరి వేదాంతసూరి ప్రోత్సాహంతో 1997 నుంచి ‘మొగ్గ’ కోసం బాల సాహిత్య రచన ప్రారంభించాను. ‘పిల్లల కోసం మన కవులు’ పేర రాసిన బాలల సాహిత్య వ్యాసాలను 2004లో పుస్తకంగా ప్రచురించాం. ఆ తర్వాత ‘చందమామ రావే’ అనే బాలల గేయ సంకలనం వేశాను. దీనికి 2013లో తెలుగు విశ్వవిద్యాలయం బాలసాహిత్య పురస్కారం లభించింది. 2016లో ‘వెన్నముద్దలు’ పేరుతో బాలగేయాల పుస్తకం వేశాను. పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు రాశాను. వివిధ భారతీయ భాషలకు చెందిన 15 పుస్తకాలను తెలుగులోకి అనువదించాను. 15 పుస్తకాలు, సంచికలకు సంపాదకత్వం వహించే అవకాశం కూడా లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల తయారీ కోసం ఏర్పాటుచేసిన సంపాదక బృందంలో ఒకడిగా పనిచేశాను. పిల్లలు దేవుడితో సమానమంటారు. అందుకే వారికోసం నిర్వహించే కార్యశాలలు బ్రహ్మోత్సవాలకంటే గొప్పవని నేను విశ్వసిస్తాను.
– మధుకర్ వైద్యుల
“పాఠాలతో పాటు పాటలు నేర్పిస్తూ పల్లె పాటల చిరునామాగా మారిందీమె !!”