Julie | తమిళనాడులో రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన వ్యాఖ్యలు చేశారు నటి, మాజీ నర్సు, బిగ్బాస్ ఫేమ్ మరియా జూలీ. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ అభిమానుల నుంచి ఎదురైన ఆన్లైన్ వేధింపుల కారణంగానే తనకు గర్భస్రావం జరిగిందని ఆమె ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో జూలీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. మీడియాతో మాట్లాడిన జూలీ, టీవీకే పార్టీకి చెందిన కొందరు మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా తనపై నిరంతరం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ట్రోలింగ్ కారణంగా తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని, గర్భవతిగా ఉన్న సమయంలో కూడా ఈ వేధింపులు కొనసాగాయని తెలిపారు.
తనపై వచ్చిన అవమానకరమైన పోస్టులు, వ్యక్తిగత దూషణలు తన మానసిక స్థితిని దెబ్బతీశాయని, ఆ ఒత్తిడి కారణంగానే గర్భస్రావం జరిగినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై గత మార్చి నెలలో ఎనిమిది మంది వ్యక్తులపై అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా తన కుటుంబం ఎదుర్కొంటున్న మరో సమస్యను కూడా జూలీ ప్రస్తావించారు. తన భర్తను రూ.15 లక్షల కిడ్నీ స్కామ్ కేసులో కావాలనే ఇరికించారని ఆరోపించారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి తమకు నోటీసులు పంపుతున్నారని, దీని వెనుక రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉందని ఆమె పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో ఒక రాజకీయ నాయకుడు, ఓ న్యాయవాది పాత్ర ఉందని ఆరోపించిన జూలీ, తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఆమె ఎలాంటి ఆధారాలను మీడియా ముందుంచలేదు. మీడియా సమావేశంలో మాట్లాడుతూనే జూలీ భావోద్వేగానికి గురయ్యారు. మాకు ఇటీవలే వివాహమైంది. మా జీవితంలోకి రాబోతున్న తొలి బిడ్డను కోల్పోయాం. ఆన్లైన్లో జరిగిన నిరంతర వేధింపులు, పరువు నష్టం కలిగించే ప్రచారాల వల్ల నేను తీవ్ర మానసిక వేదన అనుభవించాను. అదే చివరకు మా బిడ్డను కోల్పోయే పరిస్థితికి దారితీసింది అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయాన్ని నేను ఎవరి సానుభూతి కోసం చెప్పడం లేదు. మా కుటుంబం ఎదుర్కొన్న బాధను, మా మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజల ముందుంచాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను అని ఆమె స్పష్టం చేశారు.