Sabitha Indra Reddy | పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి.. దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా.. దివంగత మాజీ హోంశాఖ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి భార్యగా అందరికీ సుపరిచితమే. భర్త మరణానంతరం..అనూహ్య రీతిలో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలకు రాక ముందు వరకు ఆమె ఓ సాధారణ గృహిణి. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియదు. అనతికాలంలోనే పట్టుసాధించి ఎందరో రాజకీయ దురంధరులను మట్టికరిపించి శక్తివంతమైన మహిళా నేతగా ఎదిగారు.
చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి సబితారెడ్డి వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. 2000, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి, 2009, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి గెలుపొందారు. తొలి మహిళా హోం మంత్రిగా పదవికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కమిట్మెంట్తో చేస్తున్న అభివృద్ధిని కండ్లారా చూశారు. తన నియోజకవర్గాన్నీ అభివృద్ధి పథంవైపు నడిపించాలని బీఆర్ఎస్లో చేరారు. ఆమెను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు.
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమ సమయంలో సబితారెడ్డి హోం మంత్రిగా ఉన్నారు. తన భర్త కూడా ప్రత్యేక తెలంగాణ కోసం ఆరాటపడ్డాడు. జై తెలంగాణ పార్టీని స్థాపించి కొంతకాలం నడిపించారు. అప్పట్లో తెలంగాణ ప్రాంతం ఏవిధంగా వివక్షకు గురైందో భర్త చెబుతున్న విషయాలను నెమరు వేసుకున్నారు. ఉద్యమకారుల అనేక నిరసన కార్యక్రమాలకు పోలీసులతో అనుమతులు ఇప్పించారు. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేకపోయినా పరోక్షంగా సహకారం అందించారు.
సబితారెడ్డి వికారాబాద్ జిల్లా కోటబాస్పల్లిలో జన్మించారు. మామయ్యకు పిల్లలు లేకపోవడంతో పెంచుకున్నారు. రెడ్డి కాలేజీలో చదువుతున్నప్పుడు ఇంద్రారెడ్డితో వివాహం జరిగింది. ఇంద్రారెడ్డిది చేవెళ్ల నియోజకవర్గంలోని కౌకుంట్ల గ్రామం. చిన్నపాటి వ్యాపారం చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హోం మంత్రితో పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. తిరుగులేని నేతగా ఎదుగుతున్న సమయంలోనే 2000 సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటి వరకు గృహిణిగా ఉన్న సబితారెడ్డి భర్త ఆశయ సాధనకు రాజకీయాల్లోకి వచ్చారు. ఉపఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు. ఇంద్రన్న క్యాడర్కు అండగా నిలిచారు. చేవెళ్ల చెల్లెమ్మగా ఎదిగారు. ప్రజలకు ‘అమ్మ’గా అన్నీతానై వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున పోటీలో ఉన్నారు.