ముంబై: ‘మా పిల్లలు ఈ మధ్య సరిగా తినట్లేదు. ఇష్టమైన చాక్లెట్లను చూసినా ముఖం అదోలా పెడుతున్నారు’ అంటూ కరోనా సమయంలో పలువురు తల్లిదండ్రులు కైంప్లెంట్ చేస్తుండటం ఎక్కువయింది. దీనికి గల కారణాన్ని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. కరోనా సోకి కోలుకొన్న పిల్లలు, టీనేజర్లలో ‘పరోస్మియా’ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు పుణెకు చెందిన పిల్లల వైద్యుడు జగదీశ్ కత్వాటే తెలిపారు. ఈ లక్షణాలు ఉన్న పిల్లలు ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరని పేర్కొన్నారు. రుచికరమైన తినుబండారాల నుంచి వచ్చే కమ్మని వాసన కూడా వారికి కుళ్లిన పదార్థాల వాసనగానే తోస్తుందని చెబుతున్నారు. కరోనా లక్షణాల్లో రుచి, వాసన కోల్పోవడం ఒకటన్న విషయం తెలిసిందే. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా కొందరిలో రుచి, వాసన పసిగట్టే గ్రాహకాలు యాక్టివ్ స్టేట్లోకి రావట్లేదని యూఏఈ నిపుణులు గుర్తించారు. దీంతో బాధితులు క్రమంగా ‘పరోస్మియా’ స్టేట్లోకి వెళ్తున్నారని, రుచికరమైన ఆహారాన్ని చూసినా వారికి కుళ్లిన కోడి గుడ్డు లాంటి చెడు వాసనే కలుగుతుందని అంటున్నారు. అందుకే భోజనం చేయడానికి విముఖత వ్యక్తం చేస్తారని పేర్కొంటున్నారు. అయితే ఇది కొద్ది కాలం మాత్రమే ఉంటుందని.. బ్రీత్ ట్రైనింగ్, స్మెల్ థెరపీ, నాజల్ డ్రాప్స్ సాయంతో ఈ స్థితి నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. కొవిడ్ కారణంగా బ్రిటన్లో 2.5 లక్షల మంది టీనేజర్లు ‘పరోస్మియా’ బారిన పడ్డారు.