హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నిమ్స్ దవాఖాన దేశంలోనే అత్యధిక సంఖ్యలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్న ప్రభుత్వరంగ దవాఖానగా చరిత్ర సృష్టిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అభినందించారు. ప్రజారోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధకు నిమ్స్ సాధిస్తున్న రికార్డులే నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో అధునాతన వైద్యపరికరాలు, సిబ్బందిని అందుబాటులోకి తెచ్చి, అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని వివరించారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ నిమ్స్ దవాఖానలో ఈ ఏడాది వందకు పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు చేసిన సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రామిరెడ్డి, యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ను మంత్రి హరీశ్రావు గురువారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1989లో నిమ్స్లో తొలి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న అదే దవాఖానకు చెందిన ఉద్యోగి శ్రీనివాస్ ఇప్పటికీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, ఇటవలే పదవీ విరమణ పొందారని చెప్పారు.
కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విషయంలో నిమ్స్ 95% సక్సెస్ రేటు సాధించిందని కొనియాడారు. నిమ్స్లో 1989 నుంచి 2014 వరకు 25 ఏండ్లలో 649 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిదేండ్లలోనే 743 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసినట్టు వివరించారు. 2016 నుంచి ఏటా వందకుపైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరింత మంది కిడ్నీ రోగులకు ప్రాణదానం చేయాలని వైద్యులకు సూచించారు.
ప్రైవే ట్ దవాఖానల్లో దాదాపు రూ.12 లక్షలు ఖర్చయ్యే కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను నిమ్స్లో ఆరోగ్యశ్రీ పథ కం కింద పూర్తి ఉచితంగా చేస్తున్నట్టు హరీశ్రావు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 101 కిడ్నీ మార్పి డి శస్త్రచికిత్సలు నిర్వహించగా, ఇందులో 97మందికి ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్, సీహెచ్ఎస్ పథకాల కింద పూర్తి ఉచితంగా చేసినట్టు తెలిపారు. ఇందులో 90 మంది ఆరోగ్యశ్రీ లబ్ధిదారులని పేర్కొన్నారు.
ఈ ఏడాది జరిపిన 101 కిడ్నీ మార్పిడిల్లో 48 మందికి లైవ్ (కుటుంబసభ్యుల నుంచి సేకరించిన కిడ్నీ), 53 మందికి కడావర్ (బ్రెయిన్డెడ్కు గురైన వారినుంచి సేకరించిన కిడ్నీ) ట్రాన్స్ప్లాంట్స్ చేసినట్టు వివరించారు. అవయవ మార్పిడి చేయించుకున్నవారికి మందులను కూడా జీవితకాలం ఉచితంగా అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని గుర్తుచేశారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు అవసరమయ్యే సదుపాయాలను నిమ్స్తోపాటు గాంధీ, ఉస్మానియా దవాఖానల్లో సైతం అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
నిమ్స్లో ట్రాన్స్ప్లాంటేషన్లకు ప్రత్యేకంగా రెండు మాడ్యులర్ థియేటర్లు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ, డయాలసిస్ యంత్రాలను అందుబాటులో ఉంచినట్టు వివరించారు. కార్పొరేట్ హాస్పిటళ్లతో పోటీపడి వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నదని హరీశ్రావు పేర్కొన్నారు. వైద్యరంగంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల ప్రభావం ఇప్పుడు కనిపిస్తున్నదని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో నిమ్స్ దవాఖాన దేశంలోనే అత్యధిక సంఖ్యలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్న ప్రభుత్వరంగ హాస్పిటల్గా చరిత్ర సృష్టిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 25 ఏండ్లలో 649 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎనిమిదేండ్లలోనే 743 ఆపరేషన్లు జరిగాయి. ప్రైవేట్ దవాఖానల్లో దాదాపు రూ.12 లక్షల ఖర్చయ్యే కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను నిమ్స్లో ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తి ఉచితంగా చేస్తున్నాం. – వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
ట్రాన్స్ప్లాంట్స్కు ప్రత్యేక థియేటర్లతో నిరీక్షణ తప్పింది
ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ప్రభుత్వం ల్యామినాతో కూడిన రెండు అత్యాధునిక మాడ్యులర్ థియేటర్ల ను ఏర్పాటుచేసింది. ఈ థియేటర్ల వల్ల రోగికి ఇతర ఇన్ఫెక్షన్లు సోకవు. ట్రాన్స్ప్లాంట్ కోసం రోగులు, వైద్యులకు నిరీక్షణ తప్పుతుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం ప్రత్యేక విభాగం ఉంటుంది. కాని నిమ్స్లో యూరాలజీ విభాగం వైద్యులే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. పరిస్థితుల ఆధారంగా డే టైమ్లో సాధారణ సేవలు, రాత్రి సమయంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న కృషికి మావంతు సహకారంగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నాం.
-డాక్టర్ రాహుల్ దేవరాజ్, యూరాలజీ ప్రొఫెసర్, నిమ్స్
నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం
నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిమ్స్లో అన్నిరకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాం. అన్ని విభాగాలను గతంలో కంటే బలోపేతం చేశాం. కొత్త డిపార్ట్మెంట్లను సైతం అందుబాటులోకి తీసుకొచ్చాం. భవిష్యత్తులో వైద్యసేవలను మరింత విస్తరిస్తాం.
-డాక్టర్ మనోహర్, డైరెక్టర్ నిమ్స్ హాస్పిటల్
స్వరాష్ట్రంలో రెట్టింపు ట్రాన్స్ప్లాంట్లు
అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ఖరీదైనవి. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కు కార్పొరేట్లో రూ.10 లక్షల నుంచి రూ.12లక్షల వరకు ఖర్చవుతుంది. ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా పూర్తి ఉచితంగానే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో రూ.1.5 లక్షలు మాత్రమే మంజూరవుతాయి. కానీ ఇక్కడ రూ.2.6 లక్షల వరకు ఖర్చవుతుంది. ఆరోగ్యశ్రీ రోగులకు రూ.1.5 లక్షల కవరేజీ పోను మిగిలిన మొత్తం కూడా ప్రభుత్వమే భరిస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సహకారంతో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు రెట్టింపు స్థాయిలో నిర్వహిస్తున్నాం. 98 శాతం మందికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేస్తున్నాం.
-డాక్టర్ రామిరెడ్డి, యూరాలజీ విభాగాధిపతి, నిమ్స్