బాలీ: భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ ఇండోనేషియా మాస్టర్స్ సూపర్-750 టోర్నీలో ముందడుగు వేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-18, 15-21, 21-16తో క్రిస్టో పపోవ్ (ఫ్రాన్స్)పై సునాయాస విజయం సాధించాడు. ప్రిక్వార్టర్స్లో ఆరో సీడ్ జోనాథన్ క్రిస్టో (ఇండోనేషియా)తో తలపడనున్నాడు. మరో సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ 22-20, 21-19తో లీ డారెన్ (మలేషియా)పై విజయం సాధించి తర్వాతి రౌండ్లోకి ప్రవేశించాడు. మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణ యువ షట్లర్ ఎన్ సిక్కిరెడ్డి-ధ్రువ్ కపిల ద్వయం 21-11, 22-20 తేడాతో ఐదో సీడ్ జోడీ ప్రవీణ్ జోర్డాన్- మెలాటి డే ఒక్తావియంతి (ఇండోనేషియా) జోడీని చిత్తు చేసింది. ఇక పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్ నిరాశపర్చారు. పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ 10-21, 19-21తో హన్స్ క్రిస్టియన్ సోల్బర్గ్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోగా, సాయిప్రణీత్ 21-16, 14-21, 20-22 తేడాతో షేసర్ హిరెన్ (ఇండోనేషియా)తో పరాజయం పొందాడు. మిక్స్డ్ డబుల్స్లో వెంకట్ గౌరవ్ ప్రసాద్-జుహి దెవాంగన్ జంట, సుమిత్రెడ్డి-అశ్వినీ పొన్నప్ప ద్వయం, పురుషుల డబుల్స్లో అర్జున్-ధ్రువ్ కపిల జోడీలు నిరాశపర్చాయి.