న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో క్రీడలకు కొంత కేటాయింపులు పెరిగాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో భారత్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో క్రీడా శాఖకు రూ.3,062 కోట్లు కేటాయించింది. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గతేడాది కంటే ఈసారి రూ.305 కోట్లు అధికంగా కేటాయించారు. ఖేలోఇండియా కార్యక్రమానికి నిధులు పెంచగా.. ప్రభుత్వ ఆధీనంలోని క్రీడా సంస్థలకు నిధుల కోత విధించారు. ఖేలోఇండియా కార్యక్రమానికి రూ.974 కోట్లు కేటాయించారు. ప్రతిభ గల క్రీడాకారుల ప్రోత్సాహానికి ఇచ్చే పురస్కారాల కోసం రూ.357 కోట్లు ప్రతిపాదించారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ, భారత క్రీడాభివృద్ధి సంస్థలకు మాత్రం కోత విధించగా.. జాతీయ సేవా కార్యక్రమం (ఎన్ఎస్ఎస్)కు నిధులు పెంచారు. జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)కు గతేడాది మాదిరే ఈ ఏడాది రూ.280 కోట్లు కేటాయించగా.. క్రీడాకారులకు ఇన్సెంటివ్స్ను పెంచింది.