ఖమ్మం జిల్లాలో వ్యవసాయరంగం ఎనలేని అభివృద్ధి చెందింది. ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతుండడంతో పని పుష్కలంగా లభిస్తున్నది. ఎక్కువ మంది రైతులు వరి, పత్తి, మిర్చి పంటలను పోటాపోటీగా పండిస్తున్నారు. మొత్తం 6 లక్షల ఎకరాలు సాగవుతుండగా వీటిలో 4.50లక్షల ఎకరాలకు పైగా వరి, పత్తి, మిర్చి పంటలే సాగవుతున్నాయి. వీటితోపాటు అపరాలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, పండ్ల పంటలకూ కొదువలేదు. దీంతో ఏడాదిపాటు కూలీలకు ఉపాధి దొరుకుతున్నది. పొలం పనులతో ఇక్కడి కూలీలకే కాక పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కూలీలకూ ఉపాధి పుష్కలంగా లభిస్తున్నది. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి గడిచిన నాలుగేళ్లలో వలసలు బాగా పెరిగాయి. ఇక్కడి రైతులు సీజన్ ఆరంభంలోనే వలస కూలీలను రప్పిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు స్వయంగా వెళ్లి అడ్వాన్స్లు ఇస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఏన్కూరు మండలంలోని మేడేపల్లి గ్రామానికి వలస వచ్చిన 60 కుటుంబాలు అదే గ్రామంలో స్థిరపడ్డాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 20వేల మందికి పైగా కూలీలు మిర్చి తీసే పనులు చేస్తున్నారు.
-ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 21
మూడేళ్లుగా ఖమ్మం జిల్లాలో సాగు విస్తీర్ణం (ఎకరాల్లో)
2019 వానకాలం 5,52,170
2020 వానకాలం 5,89,060
2021 వానకాలం 5,96,149
ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 21 : జిల్లాలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఉపయోగించుకోవడంలో అప్పటి పాలకులు నిర్లక్ష్యం వహించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగు తీరులో మార్పు వచ్చింది. గతంలో రైతాంగం సాగర్ నీళ్లపైనే ఆధారపడాల్సి వచ్చేది. నీళ్లు అందని వారు వర్షాధారంగా వ్యవసాయం చేసేవారు. దీంతో సాగు ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అనే రీతిలో ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం పాలేరు నియోజకవర్గంలో భక్త రామదాసు ప్రాజెక్టు నిర్మించింది. భూగర్భ జలాలు ఒక్కసారిగా పెరిగాయి. మరోవైపు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణతో సాగునీటికి ఇబ్బందులు తప్పాయి. బోరు బావులు, ఓపెన్ బావుల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. నాలుగేళ్ల క్రితం ఎందుకూ పనికిరావు అనుకున్న నీటి వనరులన్నీ ఇప్పుడు ఏడాదిలో రెండు పంటలకు నీళ్లందిస్తున్నాయి. దీంతో కూలీలకూ ఉపాధి దొరుకుతున్నది. పొరుగు రాష్ర్టాల నుంచి కూలీలు వలస వస్తున్నారు. రైతుల ఆసక్తి మేరకు జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సహాయ సహకారాలు అందిస్తుండడంతో ఖమ్మం జిల్లాలో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది.
నిరంతరం విద్యుత్ సరఫరా.. పుష్కలంగా సాగునీరు
వ్యవసాయరంగంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఒరవడి సృష్టించింది. కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. సాగురంగాన్ని ప్రోత్సహించింది. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడమే కాకుండా దిగుబడులూ పెరిగాయి. సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే ఈ సాగు విప్లవం సాధ్యమైంది. పంటలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, చెరువుల పునరుద్ధరణ, సాగునీటి వనరుల సంరక్షణతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం, సాగర్ ఎడమ కాలువ ద్వారా పుష్కలంగా నీరందడం కూడా సాగుకు కలిసి వచ్చింది.
నెలలపాటు పని చేస్తున్నాం..
కొద్దినెలల క్రితం ఇక్కడ వ్యవసాయ పనులు చేసేందుకు కుటుంబాలతో కలిసి వచ్చాం. ఇక్కడి రైతులు మాకు కావాల్సిన అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. రోజువారీ కూలీలుగా కాకుండా నెలలపాటు పని చేసి జీతం తీసుకుంటున్నాం. నాతో పాటు పది కుటుంబాలు వచ్చాయి. ఇక్కడ చేతినిండా పని దొరుకుతున్నది. రైతులు చాలా మంచి వ్యవసాయం చేస్తున్నారు. సాగులో అన్నిరకాల పంటలు కనపడుతున్నాయి.