గిరిజన, ఆదివాసీలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దళిత బంధు తరహాలోనే గిరిపుత్రులకు గిరిజనబంధు అమలు చేస్తామని ప్రకటించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్ణయాన్ని గిరిజనులు, గిరిజన సంఘాలు స్వాగతిస్తున్నాయి. సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ, చిత్రపటాలకు గిరిజనులు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కల్లూరు, కామేపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, టేకులపల్లిలో ప్రజాప్రతినిధులు, ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని ముక్తకంఠంతో పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): గిరిజనులు, ఆదివాసీల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఇటీవల ఎస్టీల రిజర్వేషన్లను 6 నుంచి 10శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్లను ఆమోదింపజేస్తామన్నారు. దళితబంధు తరహాలో గిరిజన బంధు అమలు చేస్తామన్నారు. మరోవైపు హైదరాబాద్లో గిరిజన భవన్, ఆదివాసీ భవన్ను ప్రారంభించారు. దీనిపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కల్లూరు, కామేపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, టేకులపల్లిలో ప్రజాప్రతినిధులు, ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు సోమవారం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
కల్లూరు: సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు
గిరిజన బాంధవుడు సీఎం కేసీఆర్..
గిరిజన బాంధవుడిగా సీఎం కేసీఆర్ ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారు. పోడునే నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీల పోడు సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. మాట ఇస్తే తప్పకుండా నిలబడే వ్యక్తి కేసీఆర్. ఏదైనా సాధించాలనుకుంటే అది నెరవేరే వరకు కేసీఆర్ నిద్రపోరు. అంతటి తెగువ, చొరవ ఉన్న నేత దేశ రాజకీయాల్లోకి వెళితే అక్కడ చక్రం తిప్పడం ఖాయం. దేశ భవిష్యత్తును మార్చడం ఖాయం.
– రేగా కాంతారావు, ప్రభుత్వ విప్
దమ్మున్న నేత కేసీఆర్..
ఎస్టీ రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మెడలు వంచి రిజర్వేషన్లను ఆమోదింపజేసే సత్తా ఆయనకుంది. కాషాయ పార్టీ నేతల కుట్రలను తిప్పికట్టే దమ్మున్న నేత కేసీఆర్. బీజేపీ ఎన్ని ఎత్తుగడలు వేసినా వాటికి పైఎత్తు కేసీఆర్ వేయగలరు. ఎంతోకాలంగా పోడు సమస్యకు పరిష్కారం లభించక పోడుదారులు ఇబ్బంది పడుతున్నారు. పోడు సమస్య పరిష్కారానికీ కేసీఆర్ కృషి చేస్తున్నారు. గిరిజనులు, ఆదివాసీల తరఫున కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నా.
– కోరం కనకయ్య, భద్రాద్రి జడ్పీ చైర్మన్
అన్నివర్గాలకు సమన్యాయం..
అన్నివర్గాలకు సమన్యాయం చేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. కుల మతాల తేడా లేకుండా అన్ని వర్గాల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నారు. కేసీఆర్ సేవల కోసం దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఆయన నాయకత్వంలో భారత ప్రజలకు తప్పకుండా మేలు జరుగుతుంది. కేసీఆర్ దేశ రాజకీయాలకు వెళ్లడాన్ని ప్రతిఒక్కరూ స్వాగతిస్తున్నారు.
– లావుడ్యా సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి, సుజాతనగర్