ఖమ్మం, జనవరి18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా, ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్తో కలిసి కొవిడ్, ఒమిక్రాన్ నివారణ చర్యలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయని, అధికారులు ముందస్తు చర్యలతో సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ మొదటి డోసు వందశాతం పూర్తి చేసి జిల్లాను రెండో స్థానంలో నిలపడం అభినందనీయమన్నారు. రెండో డోసు నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు.
నగరపాలక సంస్థ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు . ఆయా డివిజన్ల పరిధిలోని కార్పొరేటర్లు సైతం ప్రతి ఇంట్లో వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అనే వివరాలు తెలుసుకోవాలన్నారు. జిల్లాలో 10,60,576 మంది మొదటి డోసు వ్యాక్సినేషన్ తీసుకున్నారని, 9,13,334 మంది రెండో డోసు మాత్రమే తీసుకున్నారని పేర్కొన్నారు. మిగతా వారు కూడా రెండు డోసు వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. రెండు డోసులు పూర్తయిన వారు నిర్ణీత గడువు తర్వాత బూస్టర్ డోసు వేసుకోవాలన్నారు. పండుగ సీజన్లో అనేక మంది వివిధ ప్రాంతాలకు వెళ్లొచ్చారని, వారి వల్ల కొవిడ్ వ్యాప్తి చెందుతున్నదని కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో హోం ఐసోలేషన్ కిట్స్ అందించాలన్నారు. ఖమ్మం అర్బన్, ఎర్రుపాలెం, ముదిగొండ మండలంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
ఐదు డివిజన్లకు ఒక ప్రత్యేకాధికారిని నియమించాలి
ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా పర్యవేక్షించాలని, ప్రతి ఐదు డివిజన్లకు ఒక ప్రత్యేకాధికారిని నియంచాలని పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలానికి వ్యాక్సినేషన్కు ప్రత్యేక అధికారిగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి అప్పారావు, ముదిగొండ మండలానికి వైరా ఏసీపీ స్నేహమెహ్రాని నియమించినట్లు చెప్పారు. తొలుత జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యక్రమ వివరాలను మంత్రికి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ మంత్రి సలహాలు, సూచనలు మేరకు ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు.
స్పెషల్ డ్రైవ్ చేపట్టి వ్యాక్సినేషన్ రెండోడోసు వందశాతం పూర్తి చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, నగర మేయర్ పునుకొల్లు నీరజ , సుడా చైర్మన్ బిచ్చు విజయకుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, అడిషనల్ డీసీపీ గౌస్ఆలమ్, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి.రాహుల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.అప్పారావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మాలతి, జిల్లా సర్వేలెన్స్ అధికారి రాజేశ్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా బి.వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
‘దళిత బంధు’కు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి
మంత్రి పువ్వాడ అజయ్కుమార్
చింతకాని మండలంలో దళితబంధు పథకం లబ్ధికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశించారు. నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో దళిత బంధు పథకంపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక అధికారులు గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతి లబ్ధిదారుతో బ్యాంకు ఖాతా తెరిపించాలన్నారు. ప్రత్యేక అధికారుల బృందం హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించి అక్కడ పథకం అమలైన తీరును పరిశీలించాలన్నారు. లబ్ధిదారులతో యూనిట్ల నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. త్వరలో ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి లబ్ధిదారులకు అవసరమైన యూనిట్ల ఎంపికపై అవగాహన కల్పిస్తామన్నారు. సమావేశంలో శాసనమండలి సభ్యుడు తాతా మధు, నగర మేయర్ పునుకొల్లు నీరజ , జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, సుడా చైర్మన్ విజయ్కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ మధుసూదన్, శిక్షణ కలెక్టర్ రాహుల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి కె.సత్యనారాయణ పాల్గొన్నారు.