ఖమ్మం, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): క్రికెట్ ఆటే వారి మృత్యుపాశమైంది. ప్రహరీ మధ్యలో ఇరుక్కుపోయిన బంతిని తీసే క్రమంలో రావి చెట్టు కూలి ఇద్దరు బాలురు మృతిచెందగా పలువురు గాయాలపాలైన ఘటన ఖమ్మం నగరంలోని బ్రాహ్మణబజార్లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరంలోని బ్రహ్మణ బజార్లోని ఓ ఖాళీ స్థలంలో దిగాంత్ శెట్టి (11), ఆయుష్ (6) కొందరు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో ఓ బాలుడు బ్యాట్తో షాట్ కొట్టగా బంతి పక్కనే ఉన్న ప్రహరీ మధ్యలోని ఖాళీ స్థలంలోకి వెళ్లింది. పిల్లలు బంతిని బయటకు తీస్తున్న క్రమంలో ప్రహరీ కదిలింది.
దీంతో ప్రహరీ మధ్యలో ఉన్న రావిచెట్టు ఒక్కసారిగా ఖాళీ స్థలంలోని పిల్లలపై పడింది. ఘటనలో దిగాంత్ శెట్టి(11), ఆయుష్ (6) అక్కడికక్కడే మృతిచెందారు. సాకేత్, సాయి ఆర్యన్, చరణ్ సాయితో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. అనుమోల్ అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి వచ్చారు. సమాచారం అందుకున్న ఖమ్మం ఒకటో పట్టణ పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది, నగరపాలక సంస్థ డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆటో ద్వారా నగరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ గౌస్ అలమ్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ సురభి, ట్రైనీ కలెక్టర్ బి.రాహుల్, ఆర్టీవో రవీంద్రనాథ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, అర్బన్ తహసీల్దారు శైలజ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతులు, క్షతగాత్రుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ ఎస్సై వెంకన్న తెలిపారు.
ఏకైక కుమారుడు దిగాంత్ శెట్టి..
కర్ణాటకకు చెందిన దినకర్శెట్టి, శీల దంపతులు కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం ఖమ్మం వచ్చాడు. దినకర్శెట్టి ఓ హోటల్లో క్యాషియర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారి ఒక్కానొక్క కుమారుడు దిగాంత్ శెట్టి మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
కుమారుడు మృతి..మరో కుమారుడు క్షతగాత్రుడు..
ప్రకాష్, కళావతి దంపతులు కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం రాజస్థాన్ నుంచి ఖమ్మం నగరానికి వచ్చారు. ఓల్డ్ క్లబ్ రోడ్డులో ఆప్టికల్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అనుమోల్, చిన్న కుమారుడు ఆయుష్ (6). ప్రమాదంలో ఆయూష్ చెట్టు కూలిన ఘటనలో అక్కడికక్కడే మృతిచెందాడు. మరో కుమారుడు అనుమోల్ తీవ్రగాయాల పాలయ్యారు. ఒక కుమారుడు విగతజీవిగా మరో కుమారుడు క్షతగాత్రుడిగా చూసి తల్లిదండ్రులు గుండలవిసేలా విలపించడం చూపరులను కన్నీరు పెట్టించింది.
గేట్లు తీసి ఉండడమే కారణమా..?
నగరంలోని బ్రాహ్మణ బజార్లో చోటుచేసుకున్న ప్రమాదానికి కారణం ఖాళీ స్థలం గేట్లు తీసిఉండడమేనని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. ‘ఆ స్థలం నగరానికి చెందిన ఓ వ్యాపారిది. ఎప్పుడూ గేటుకు తాళం వేసి ఉంచేవాడు. ఇటీవల నగరంలోని కస్బాబజార్లోని వస్త్ర దుకాణ యాజామాన్యం ఈ స్థలాన్ని పార్కింగ్ కోసం లీజ్కు తీసుకున్నది. వారం రోజుల క్రితం స్థలాన్ని శుభ్రం చేయించింది. రోజువారీగా గేటుకు తాళం వేసే సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం మాత్రం వదిలేశారు. దీంతో సాయంత్రం 3:30 గంటల సమయంలో కొందరు చిన్నారులు ఖాళీ స్థలంలోకి వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు.’ అని స్థానికులు తెలిపారు.