అన్నదాతల ముఖాల్లో ‘రైతుబంధు’ సాయం సంతోషం కనిపిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం యాసంగి పంట పెట్టుబడి కోసం బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తుండడంతో రైతాంగం ఉత్సాహంగా సాగుకు సన్నద్ధమవుతున్నది. ఈ సీజన్కు సంబంధించి ఇప్పటికే మండలంలోని సగానికి పైగా లబ్ధిదారులకు పెట్టుబడి సాయం రాగా, మరో రెండు మూడు రోజుల్లో మిగతా వారికీ అందనున్నది.
-తిమ్మాపూర్ రూరల్, జనవరి 4
తిమ్మాపూర్ మండలంలో మొత్తం 11,662 మంది రైతులు ఉన్నారు. వీరికి మొత్తం రూ.11.54కోట్లు పెట్టుబడి సాయం రానున్నది. ఆదివారం సాయంత్రం వరకు 9,698మంది రైతులకు గానూ.. రూ.6.90కోట్ల పెట్టుబడి సాయం (ఎకరానికి రూ.5వేలు) నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమైంది. దీంతో ఇప్పటికే కొందరు రైతులు వారి బ్యాంకు ఖాతాల నుంచి నగదు విడిపించుకొని సాగు పనులు మొదలు పెట్టగా, మరికొందరు డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు.
ఇతర పంటల వైపు మొగ్గు..
యాసంగి సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సరైన సమయానికి ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించగా, రైతులు పొలాల పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలో వరితో పాటు ఈ సారి పెద్ద ఎత్తున కూరగాయలు, మక్క, ఇతర వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. వాటి సాగుకు ఈ నగదును ఖర్చు పెడుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.
పెట్టుబడికి పనిచేస్తది
పసలు, పసలుకు పెట్టుబడికి రైతులు పడుతున్న బాధ అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సీజన్ ప్రారంభం ముందే రైతుబంధు ఇస్తున్నారు. నాకు ఐదు ఎకరాల భూమి ఉండగా రూ.25 వేలు బ్యాంకు ఖాతాలో పడ్డయి. ప్రస్తుతం అవి పొలం పనుల సాగుకు ఉపయోగపడుతయి. నాలెక్క ఎంతో మందికి ఇబ్బంది లేకుండా పైసలు ఇస్తున్న సీఎం సార్కు కృతజ్ఞతలు.
-గాండ్ల శ్రీనివాస్, యువరైతు, మక్తపల్లి
అందరికీ వస్తాయి..
రైతుబంధు పెట్టుబడి సాయం రైతులందరికీ అందుతుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ మధ్య రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ఈ సారి రైతుబంధు పడదు. రైతుబంధు సాయం గురించిన ఏమైనా అనుమానాలు ఉంటే రైతులు వారి క్లస్టర్ పరిధిలో ఏఈవోలను సంప్రదించాలి.
-జే సురేందర్, ఏవో, తిమ్మాపూర్