కొత్తగూడెం క్రైం, జూలై 14: గోదావరి ఉగ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని భద్రాద్రి ఎస్పీ సునీల్దత్ గురువారం ప్రకటించారు. సాయంత్రం 5 నుంచి 48 గంటల పాటు భద్రాచలం బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయాల్లో ‘డయల్ 100’ లేదా కంట్రోల్ రూం నంబర్లు 08744-241950, 08743-232444ను సంప్రదించాలన్నారు. గోదావరి సందర్శనకు అనుమతి లేదన్నారు. ప్రజలు యంత్రాంగానికి సహకరించాలని కోరారు. చప్టాలు, వంతెనల వద్ద వాహన రాకపోకలను నిలిపివేస్తున్నామన్నారు. ప్రజలెవరూ ఆందోళన పడొద్దని, పోలీసులు, అధికారులు అండగా ఉంటారన్నారు.
శుభకార్యాలకు ఆర్టీసీ బస్సు అద్దెలో రాయితీ
శుభకార్యాలు, విహార యాత్రలు, పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లే వారికి శుభవార్త. ఆర్టీసీ యాజమాన్యం ఈ ఏడాది జూన్ 30 వరకు అమలైన రాయితీలను సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. నెల రోజులు ముందుగా బస్సును రిజర్వ్ చేసుకుంటే అద్దెలో 15 శాతం రాయితీ, 2 నెలల ముందు రిజర్వ్ చేసుకుంటే 20 శాతం రాయితీ ఉంటుందని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఎస్తేర్ ప్రభులత తెలిపారు.
తిరుమల దర్శనానికీ..
తిరుమల దర్శనానికి వెళ్లే వారికి ఆర్టీసీ యాజమాన్యం తీపికబురు అందించింది. గతంలో ఉన్న నిబంధనలను సడలిస్తూ మార్పులు చేసింది. తిరుమల తిరుపతి వెళ్లేందుకు భక్తులు ఆర్టీసీ టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే వారికి యాజమాన్యం దైవ దర్శనం టికెట్ ఇస్తుంది. ఇకపై తిరుగు ప్రయాణమూ తప్పనిసరి కాదు. గురువారం నుంచి కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. గతంలో ఈ నిబంధన అమలులో ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడాల్సివచ్చేది. కొత్త మార్పులతో భక్తులు సులభంగా ప్రయాణం సాగించవచ్చు.