ఖమ్మం, నవంబర్ 28 : అద్దంలా మెరిసే రహదారులు.. వాటి మధ్య సువాసనలు వెదజల్లే అందమైన మొక్కలు.. ఎల్ఈడీ కాంతులు.. కార్పొరేట్ షాపింగ్ మాల్స్ జిగేలు.. పార్కుల అందాలు.. ప్రధాన కూడళ్ల మధ్య ఆహ్లాదాన్ని పంచుతున్న ఫౌంటేన్లతో ఖమ్మం నగరం సుందరంగా కనిపిస్తున్నది. సమైక్యపాలనలో అభివృద్ధికి నోచుకోక.. విసిరివేసినట్లు ఉన్న నగరం నేడు రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో మహా నగరంగా వర్ధిల్లుతున్నది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ పలు జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధుల రివ్యూ సమావేశాల్లో ఖమ్మం అభివృద్ధిని ప్రశంసిస్తున్నారు.. ఇక్కడి అభివృద్ధిని నమూనాగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్లో జరి గిన నిజామాబాద్ ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశంలో ఖమ్మం అభివృద్ధి గురించి ప్రత్యేకంగా వివరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఖమ్మం వెళ్లి అభివృద్ధిని చూసి రావాలని ఆదేశిం చారు. దీంతో మరొకసారి నగర అభివృద్ధి రాష్ర్టానికి ఆదర్శంగా నిలిచింది.
మురికిగుంత… పందుల గుంపులు… కుక్కల స్వైరవిహారం… దారుల వెంట దుర్వాసన.. గుంతల రోడ్లు.. వెలగని వీధిలైట్లు.. వీధివీధినా చెత్తకుప్పలతో ఒకనాడు(తెలంగాణ రాకముందు) గందరగోళంగా ఉన్న ఖమ్మం నగరం నేడు సుందర, సుసంపన్న నగరంగా పరిఢవిల్లుతున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ప్రోత్సాహం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక కృషి కారణంగా ఖమ్మం రాష్ట్రంలోని పలు జిల్లాలకు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ పలు జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధుల రివ్యూ సమావేశాల్లో ఖమ్మం అభివృద్ధిని ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే గతంలో వరంగల్, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఏపీలోని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సైతం ఖమ్మం వచ్చి ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించి వెళ్లారు.
మెరిసిపోతున్న ఖమ్మం..
ఖమ్మం నగరం అభివృద్ధిలో దూసుకెళ్తూ.. సుందరంగా మెరిసిపోతున్నది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చేస్తున్న విశేష కృషిగా చెప్పవచ్చు. మున్సిపాలిటీగా ఉండి మురికికూపంగా ఉన్న ఖమ్మంను కార్పొరేషన్గా అవతరింపజేసి వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. నగరానికి తూర్పున లకారం చెరువు అభివృద్ధితోపాటు ఉత్తరాన కొత్త బస్టాండ్, దక్షిణాన రైల్వే ఓవర్ బ్రిడ్జి, పడమరన వైకుంఠధామం అభివృద్ధి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు ఉన్న ఖమ్మం నగరాన్ని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రస్తుతం ఖమ్మం నగరాన్ని పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా కన్పిస్తున్నది. దూరప్రాంతాల నుంచి వచ్చిన ఎవరైనా ఖమ్మనికి కొత్తగా చూస్తే ఇది ఖమ్మం నగరమేనా అని ఆశ్చర్యపోక తప్పదు. వైరా రోడ్డు అభివృద్ధి గాని, ఇల్లెందు రోడ్డు విస్తరణ, కాల్వొడ్డు రహదారుల నిర్మాణం, బైపాస్ రోడ్డు, నగరంలో అంతర్గత రోడ్ల నిర్మాణం చూసిన ఎవరికైనా అభివృద్ధిలో తేడా కన్పించక మానదు. అంతేకాకుండా ఇల్లెందు క్రాస్రోడ్డులో నిర్మించిన ఐటీ హబ్ నగరానికే తలమానికంగా మారింది. దీనంతటికీ ప్రధాన కారణం కార్యదీక్షత, పట్టుదల, అభివృద్ధి చేయాలనే తపన ఉన్న నాయకుడు పువ్వాడ శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉండటమే. మంత్రి పువ్వాడకు మంత్రి కేటీఆర్తో ఉన్న సన్నిహితంతోపాటు సీఎం కేసీఆర్ చంద్రశేఖర్రావుతో ఉన్న అవినాభావ సంబంధం రీత్యా ఖమ్మం అభివృద్ధికి వరదలా నిధులు వచ్చిపడుతున్నాయి. దీనికితోడు సమర్ధవంతమైన అధికార యంత్రాంగం ఉండడంతో ఖమ్మం అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
కేసీఆర్తోనే బంగారు తెలంగాణ..
నాలుగు దశాబ్ధాల పోరాట చరిత్ర కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టం. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణను సాధిస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే సుమారు రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి చేశారు. దీంతో ఖమ్మం జిల్లా రూపులేఖలే మారిపోయాయి. తెలంగాణ ఉద్యమంలో ఇతర జిల్లాల కంటే ఖమ్మం జిల్లా ఉద్యమం తక్కువగా ఉందని భావించినప్పటికీ అభివృద్ధిలో మాత్రం ఇతర జిల్లాల కంటే ఖమ్మనికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామం. ఖమ్మం నగరాన్ని స్మార్ట్సిటీ చేయడం కోసం ముఖ్యమంత్రి కేంద్రానికి ప్రతిపాదనలు పంపి అమలు చేశారు. ఖమ్మంతోపాటు కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, మధిర ఇతర పట్టణాలను సైతం అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
ఆహ్లాదపరుస్తున్న పార్కులు, ఫౌంటేన్లు..
ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించిన ఫౌంటేన్లు, పార్కులు నగర వాసులను ఆహ్లాదపరుస్తున్నాయి. లకారం ట్యాంక్బండ్ వద్ద ఉన్న పార్కు నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. లకారం చెరువులో నీళ్లు.. పక్కన ట్యాంక్బండ్ ఆహ్లాదపరుస్తున్నది. ఆదివారంతోపాటు ప్రతి సెలవు దినాల్లో నగరవాసుల రాకతో పార్కు కోలాహలంగా మారుతున్నది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు సాయంత్రం వేళల్లో ఎంతో సంతోషంగా ఇక్కడ గడుపుతున్నారు. అదేవిధంగా ఇల్లెందు క్రాస్రోడ్డు, కాల్వొడ్డు, మమత రోడ్లోని లకారం పార్క్ వద్ద నూతనంగా నిర్మించిన ఫౌంటేన్లు రాత్రి వేళల్లో నగర ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నీటి బిందువులు.. వెలుగుల కాంతుల మధ్య ముత్యాలవలె మెరుస్తున్నాయి. నగర ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఫౌంటేన్ల అందాలను తిలకిస్తూ సెల్ఫీలు దిగుతూ ఆనందిస్తున్నారు. ఇదికాకుండా ఎన్టీఆర్ సర్కిల్, శ్రీశ్రీ సర్కిల్, తహసీల్దార్ కార్యాలయం తదితర చోట్ల ఉన్న గ్రీనరీలు ప్రజలను ఆహ్లాదపరుస్తున్నాయి. నగరంలో ఉన్న అనేక పార్కులు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రోటరీనగర్, వ్యవసాయ మార్కెట్, చర్చ్ కాంపౌండ్, జహీర్పుర తదితర చోట్ల ఉన్న పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. సాయంత్రం వేళల్లో మహిళలు, చిన్నారులతో ఈ పార్కులు కిటకిటలాడుతున్నాయి.
ఎల్ఈడీ కాంతుల వెలుగులు..
రాత్రిపూట ఖమ్మం నగరంలో అడుగుపెట్టే ఎవ్వరికైనా ఆహ్లాదకర వాతావరణం కనువిందు చేస్తున్నది. భయంకరమైన నిశీధి కూడా పగటిపూటలా వెలిగిపోతున్నది. నగరానికి కొత్త అందాలను తీసుకురావడం, రోజురోజుకు పెరిగిపోతున్న విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకు ఖమ్మం నగరపాలక సంస్థ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అతి తక్కువ ఖర్చుతో వెన్నెల లాంటి వెలుగులను నగర ప్రజలకు అందించేందుకు ఎల్ఈడీ లైటింగ్ సిస్టంను అమల్లోకి తీసుకువచ్చింది.