రఘునాథపాలెం, నవంబర్ 28 : విధి నిర్వహణలో గొత్తికోయల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) భీమానాయక్ పేర్కొన్నారు. శ్రీనివాసరావు మరణంతో తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎఫ్ఆర్వో కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేసిన విషయం విదితమే. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం, భద్రాద్రి డీఎఫ్వోలు సిద్దార్థ విక్రమ్సింగ్, రంజిత్నాయక్తో కలిసి సీసీఎఫ్ భీమానాయక్ సోమవారం మండలంలోని ఈర్లపూడి గ్రామానికి వెళ్లి శ్రీనివాసరావు సతీమణి భాగ్యలక్ష్మికి ఆ చెక్కును అందజేశారు.
ముందుగా సీసీఎఫ్, డీఎఫ్వోలు, ప్రజాప్రతినిధులు ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసరావు భార్యాపిల్లలను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందంటూ ధైర్యం చెప్పారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సహకారంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయని, అంతేగాక ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగం, ఇంటి స్థలం తప్పక అందజేస్తామని భరోసా ఇచ్చారు. శ్రీనివాసరావు మరణం భాధాకరమని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. కేఎంసీ మేయర్ పునకొల్లు నీరజ, డీసీసీబీ, సుడా చైర్మన్లు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్కుమార్, ఎంపీపీ భుక్యా గౌరి, వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్, టీఆర్ఎస్ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కుర్రా భాస్కర్రావు, మందడపు నర్సింహారావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మందడపు సుధాకర్, లక్ష్మణ్నాయక్, రాధిక, నర్సింహారావు, రామకృష్ణ, చిట్టెం నర్సింహారావు, వెంకట కోటయ్య, బానోతు రవి తదితరులు పాల్గొన్నారు.