కొత్తగూడెం క్రైం, నవంబర్ 28: దండకారణ్యంలో మావోయిస్టులు ప్రజల ఆదరణ కోల్పోతున్నారని ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలితో పాటు ముగ్గురు మిలీషియా సభ్యులు భద్రాద్రి పోలీసుల ఎదుట లొంగిపోయిన సందర్భంగా పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. మావోయిస్టు పార్టీ నాయకులు ఆదివాసీల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని, ఇన్ఫార్మర్ల నెపంతో ఎంతోమందిని హతమర్చారన్నారు. దీంతో ఆదివాసీల పిల్లలు అనాథలు అవుతున్నారన్నారు. వారు అమాయక ఆదివాసీ, గిరిజనులపై ఆధారపడి బతుకుతున్నారన్నారు. వారి నుంచి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. నిత్యావసర వస్తువులు అపహరిస్తున్నారన్నారు. ఒక్కో ఇంటి నుంచి రూ.500 ఇవ్వాలని హుకుం జారీ చేశారన్నారు. మావోయిస్టుల సమావేశాలకు హాజరు కాకపోతే బలవంతంగా జరిమానా విధిస్తున్నారన్నారు.
ఆదివాసీలు పశువులు, గిరిజనులు సంచరించే ప్రదేశాల్లో ల్యాండ్మైన్లు, ప్రెషర్ బాంబ్స్ అమరుస్తున్నారన్నారు. మావోయిస్టుల అరాచకాలను చూస్తూ విసిగిపోయిన వారు ఎంతోమంది దళ సభ్యులు, మిలీషియా సభ్యులు జన జీవన స్రవంతిలో కలుస్తున్నారన్నారు. దీనిలో భాగంగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా రాంపురానికి చెందిన మడివి మూయ, భద్రాద్రి జిల్లా చర్ల మండలం కొరకట్పాడుకి చెందిన రవ్వ దేవా, బూరుగుపాడుకు చెందిన కొవ్వాసి గంగ, వండొ దూలే మిలీషియా సభ్యులు జిల్లా పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ 81, 141 బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయారు. మడివి మూయ రెండేళ్ల నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న దళంలో పనిచేస్తున్నదని ఎస్పీ తెలిపారు. అనంతరం లొంగిపోయిన వారికి ప్రభుత్వం అందించే నగదు ప్రోత్సాహకాలు అందించారు. ఎస్పీ వెంట కొత్తగూడెం ఓఎస్డీ టి.సాయిమనోహర్, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండెంట్ కమల్వీర్ యాదవ్, 81వ బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండెంట్ పియూష్ తివారి, చర్ల సీఐ బొడ్డు ఆశోక్ కుర్, ఎస్సై ఆలెం రాజువర్మ పాల్గొన్నారు.