దమ్మపేట రూరల్, నవంబర్ 28: ఆయిల్ఫెడ్ సంస్థ నర్సరీల్లో ఆయిల్పాం మొక్కలు పెంచి రైతులకు రాయితీపై అందిస్తున్నది. ఎకరానికి 57 మొక్కల చొప్పున రైతులకు రాయితీ పోను ఒక్కో మొక్కను రూ.20కు విక్రయిస్తున్నది. ఆయిల్పాం మొక్కలకు ప్రస్తుతం ఏపీలో మంచి డిమాండ్ ఉంది. అక్కడ ప్రభుత్వం మొక్కల పంపిణీకి ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదు. దీంతో కొందరు అక్రమార్కులు దొడ్డిదారిన మొక్కలను ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. అశ్వారావుపేటలో కొందరు దళారుల అవతారం ఎత్తి ఏపీలో ఒక్కో మొక్కను రూ.300-500కు విక్రయిస్టున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఇటీవల సత్తుపల్లి మండలం నుంచి ఆంధ్రాలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పోతునూరులో అక్రమంగా తరలిన మొక్కలను ఆయిల్పాం రైతులు పట్టుకున్నారు. ఈనెల 26న జనగాం నర్సరీ నుంచి ఆంధ్రాకు వెళ్తున్న 750 ఆయిల్పాం మొక్కల లారీని అక్కడి రైతులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఆయిల్ఫెడ్ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఈ పరిస్థితి అని వేరే చెప్పనక్కర్లేదు. ఇటీవల అశ్వారావుపేట మండలంలోని నారవారిగూడెం ఆయిల్పాం నర్సరీలో గతేడాది 500 మొక్కలు అపహరణకు గురైనా ఆయిల్ఫెడ్ అధికారులకు రైతులు చెప్పేవరకు తెలియకపోవడం శోచనీయం. చోరీపై అశ్వారావుపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 500 మొక్కల ధర రూ.1.25 లక్షలు వసూలు చేయడం గమనార్హం. మొక్కల తరలింపుపై ‘నమస్తే’ ఆయిల్ఫెడ్ డివిజనల్ మేనేజర్ను వివరణ కోరగా.. జనగాం నర్సరీలో మొక్కల చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. పోతునూరు ఘటనపై విచారించగా తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.
ఏడాది నుంచి ప్రదక్షిణలు..
నేను 7.5 ఎకరాల భూమిలో ఆయిల్పాం సాగు చేసేందుకు గతేడాది జూన్లో ఆయిల్ఫెడ్కు దరఖాస్తు చేసుకున్నాను. అప్పటి నుంచి మొక్కల కోసం అశ్వారావుపేట డివిజన్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. ఇక్కడి రైతులకు మొక్కలు ఇవ్వకుండా ఏపీకి తరలించడం బాధాకరం.
– చంద్రబట్ల మధుసూదన్రావు,రైతు, దమ్మపేట