ఖమ్మం, ఆగస్టు 14: ఖమ్మం కార్పొరేషన్లోని నయాబజార్ కళాశాల వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందిన చిర్రా సందీప్, ఇటీవల నేలకొండపల్లి మండలంలోని సుర్థేపల్లిలో చెక్డ్యాంలో గల్లంతై పడిగల వెంకటేశ్, బాశెట్టి ప్రదీప్ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఒక్కో మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల సాయాన్ని విడుదల చేసింది.
ఆ చెక్కులను ఆదివారం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బాధిత కుటుంబాలకు అందజేశారు. అనంతరం వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని పడిగల వెంకటేశ్ తల్లి నాగలక్ష్మి మంత్రిని కోరగా వారి కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇవ్వాలని నగరపాలకసంస్థ కమిషనర్ ఆదర్శ్సురభిని ఆదేశించారు.
అలాగే బాశెట్టి ప్రదీప్ భార్య నాగలక్ష్మికి ఔట్సోర్సింగ్ కొలువు ఇవ్వాలని, కుమార్తె చదువుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా ముక్తార్, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కార్పొరేటర్ కమర్తపు మురళి పాల్గొన్నారు.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 53వ డివిజన్ గట్టయ్య సెంటర్, 51వ డివిజన్ బుర్హన్పురంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కులను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలకు అవసరమయ్యే పార్కులను ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు. పార్కుల్లో 5వేల మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. మేయర్ నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, మల్లీశ్వరి, సుడా చైర్మన్ విజయ్కుమార్, జోహారా ముక్తార్, కార్పొరేటర్లు మురళి, శ్రీవిద్య, రమ, టీఆర్ఎస్ నాయకులు నాగరాజు, శీలంశెట్టి వీరభద్రం పాల్గొన్నారు.