సుజాతనగర్, నవంబర్ 16 : కోటి రూపాయలు గెలిచినా నా పోరాటం ఆగదని తెలంగాణ ముద్దుబిడ్డ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి, ఎవరు మీలో కోటీశ్వరుడు విజేత రాజారవీంద్ర తెలిపారు. మంగళవారం ఆయన ‘నమస్తే’తో ఫోన్లో మాట్లాడారు. ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమంలో పాల్గొని విజయం సాధించడంతో చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇప్పటివరకు ఇటువంటి ఈ ఆటను ఎవ్వరూ పూర్తి చేయలేదని, తనకు ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్తో కూర్చొని ఆటలో పాల్గొనడం జీవితంలో మరువలేని అనుభూతిగా అభివర్ణించారు. గెలిచిన డబ్బుతో ప్రపంచ స్థాయిలో జరిగే షూటింగ్లో పాల్గొని దేశానికి మెడల్ తీసుకురావాలన్నదే తన కోరికగా చెప్పాడు. తన కుమారుడు చిన్నతనంలో ఆరోగ్యం బాగా లేక ఇబ్బంది పడ్డానని, ఆ ఇబ్బంది ఏ తల్లిదండ్రులు, పిల్లలు పడకుండా వచ్చిన కోటి రూపాయల్లో తనవంతు సా యంగా చిల్డ్రన్స్ వెల్ఫేర్కు కొంత ఇస్తానని ప్రకటించారు. కార్యక్రమానికి తనకు సపోర్టు చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం జరి గిన ఎపిసోడ్లో రాజా రవీంద్ర ఎన్టీఆర్ నుంచి కోటి రూపాయల చెక్కును అందుకున్నారు.
మాకూ గౌరవం లభిస్తున్నది
మా అబ్బాయికి కోటి గెలిచాడని తెలిసినప్పటి నుంచి మా ఇంటికి అధిక సంఖ్యలో స్థానికులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు వచ్చి అభినందిస్తున్నారు. మా అబ్బాయికి లభించాల్సిన గౌరవం మాకు లభిస్తున్నది. ఈ స్థాయికి రావడానికి ప్రోత్సహించిన వైరాలోని మధు విద్యాలయం అధినేత, ప్రిన్సిపాల్కు మా కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సహకరించిన పోలీస్శాఖకు కృతజ్ఞతలు.
ఈ ఆనందాన్ని మర్చిపోలేను
ఎవరు మీలో కోటీశ్వరుడు విజేతగా ప్రకటించినప్పుడు వచ్చిన ఆనందం, అనుభూతిని నేను జీవితంలో మర్చిపోలేను. కొడుకును కన్నందుకు ఇంతకంటే సంతోషం ఇంకేం కావాలి. మా అబ్బాయి గెలిచాడని తెలిసి చిన్ననాటి స్నేహితులు అందరూ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని జీవితంలో మర్చిపోను.