తెలంగాణ సర్కారు మత్స్య పరిశ్రమను ప్రోత్సహించాలన్న సంకల్పంతో పంజర చేపల పెంపకానికి నాంది పలికింది. ఆధునిక పద్ధతిలో చేపల పెంపకం కోసం ఔత్సాహిక మత్స్యకారులను ప్రోత్సహిస్తున్నది. ఒక్కో యూనిట్కు రూ.30 లక్షల రుణంలో 80 శాతం రాయితీతో చేపడుతున్న కేజ్ కల్చర్లో ఉత్పత్తులు అధికంగా ఉంటున్నాయి. దీంతో మత్స్యకారులు మంచి లాభాలు పొందుతున్నారు. కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్లో 9 యూనిట్లు ఏర్పాటు చేసింది. కేజ్ కల్చర్ మత్స్యకారులు వాటిల్లో చేపలను పెంచుతున్నారు. ఏడాదికి సుమారు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఒక్కటితో మొదలైన కేజ్ కల్చర్ యూనిట్ ఇప్పుడు తొమ్మిది అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మంచి ఆదాయాన్ని ఇస్తున్న ఆధునిక చేపల పెంపకంపై ‘నమస్తే తెలంగాణ’
ప్రత్యేక కథనం..
కూసుమంచి, నవంబర్ 16 : ఝార్ఖండ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా మొదలైన పంజర చేపల పెంపకం తర్వాత తెలంగాణకు విస్తరించింది. అది విజయవంతం కావడంతో పాలేరు రిజర్వాయర్ పరిధిలోని మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. 2015లో మొదటిసారిగా ఒక్క యూనిట్తో ఏర్పాటు చేసిన మత్స్యశాఖ ప్రస్తుతం 9 యూనిట్ల ద్వారా 360 టన్నుల చేపలను ఉత్పత్తి చేస్తోంది. చెరువుల్లో చేపలు పెంచే విధానం కంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ చేపలు పెంచడం, అధిక దిగుబడులు సాధించడం, సులువుగా పర్యవేక్షించడం వంటి సదుపాయాలు మంచి లాభాలకు కారణమవుతున్నాయి.చేపల పెంపకంపై ఆసక్తి ఉన్న మత్స్యకారులు 10 మంది కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ఒక యూనిట్ను ఏర్పాటు చేసుకుంటున్నారు.
80 శాతం సబ్సిడీ..
పది కేజ్లతో కూడిన ఒక యూనిట్ ఏర్పాటుకు రూ.30 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా 10 మంది రైతులకు 80 శాతం సబ్సిడీగా రూ.24 లక్షలను అందిస్తోంది. మిగిలిన 20 శాతమైన రూ.6 లక్షలు రైతుల వాటాధనం. యూనిట్ ఏర్పాటుకు రూ.14 లక్షలు, మెటీరియల్కు రూ.16 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ మెటీరియల్ ఖర్చులో చేప పిల్లలు, దాణా, 9 నెలల పర్యవేక్షణ వంటివి ఉంటాయి. ప్రస్తుతం పాలేరులో 90 మంది రైతులు కలిసి 9 యూనిట్లు ఏర్పాటు చేశారు. మొదటి ఏడాది మాత్రమే మత్స్యకారులకు సబ్సిడీ అందిస్తారు. రెండో సంవత్సరం నుంచి రైతులు సొంతంగా యూనిట్ను నిర్వహించుకోవాల్సి ఉంటుంది.
ఒక్కో కేజ్లో 4 టన్నుల చేపల ఉత్పత్తి
ఒక్కో యూనిట్లో 10 కేజ్లు ఉంటాయి. ఒక్కో కేజ్ 6 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు ఉంటుంది. ప్రతి కేజ్లో 5,000 చేప పిల్లలను వదులుతారు. వాటిల్లో 80 శాతం అంటే 4,000 పిల్లలు బతికి పెద్దవి అవుతాయి. 9 నెలల కాలంలో ఒక్కోటి కేజీ వరకు బరువు పెరుగుతాయి. ఒక్కో కేజీ చేపలను రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తారు. ఒక కేజ్లో 4,000 వేల చొప్పున ఒక యూనిట్లో 40,000 చేపలు పెరిగి నాలుగు టన్నుల బరువు వస్తాయని శాస్త్రవేత్తలు డాక్టర్ విద్యాసాగర్రెడ్డి, శాంతన్న చెబుతున్నారు. పాలేరులో 9 యూనిట్లలో కలిపి 360 టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి.
కేజ్ కల్చర్ బాగుంది..
2015లో పాలేరులో కేజ్ కల్చర్ మొదలు పెట్టడానికి ఇక్కడి అధికారులు నాతోపాటు 10 మందిని ఝార్ఖండ్ రాష్ర్టానికి పంపించారు. అక్కడ 15 రోజులపాటు ఉండి అనేక విషయాలను నేర్చుకొని ఇక్కడి వచ్చి కేజ్ కల్చర్ ఏర్పాటు చేశాం. ఆరేళ్లయినా కేజ్లు ఇప్పటికీ బాగానే ఉన్నాయి. పంజర చేపల పెంపకంలో మంచి లాభాలు ఉన్నాయి. ప్రతి కేజ్లో 4 టన్నులకు తగ్గకుండా చేపలు ఉత్పత్తి అవుతాయి. వాటిని బయటి మార్కెట్లో విక్రయిస్తున్నాం. చేపలకు దాణా పెట్టడం, వాటిని పట్టుకోవడం, వాటి ఎదుగుదలను పర్యవేక్షించడం వంటివి కేజ్ కల్చర్లో ఎంతో సులభం.
కేజ్ కల్చర్తో మంచి దిగుబడి..
పాలేరులో 9 యూనిట్లు ఉన్నాయి. వాటిల్లో మత్స్యకారులు మంచి దిగుబడులు సాధిస్తున్నారు. చేపలకు ఏదైనా వ్యాధి వస్తే వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది. మత్స్యకారులకు కళ్ల ముందే చేపల ఎదుగుదల కనిపిస్తుంది. వాటిని పట్టుకోవడం కూడా తేలికగా ఉంటుంది. మంచి దిగుబడి వస్తుంది. 80 శాతం సబ్సిడీపై కేజ్ కల్చర్ యూనిట్ను ఏర్పాటు చేయడంతో మత్స్యకారులకు అదనంగా రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకు ఆదాయం వస్తుంది. మత్స్యకారులు చిన్నచిన్న చెరువుల్లోనూ కేజ్ కల్చర్ను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి.