కల్లూరు, డిసెంబర్ 2: వానకాలం సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు. మండలంలోని ముచ్చవరంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని అన్నారు. జిల్లావ్యాప్తంగా 250 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. రవాణా విషయంలో రైతులు అధైర్యపడాల్సిన పనిలేదని, జిల్లాలోని మిల్లర్లతో చర్చించి ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న మిల్లుల్లోనే ధాన్యం నిల్వ చేసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో వారం రోజుల్లోగా నగదు జమ చేస్తామన్నారు. రాబోయే వేసవిలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులకు రక్తహీనతపై అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ మంగీలాల్ పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రం పరిశీలన
ఈనెల 10న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు.