నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 9 : సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిషరించాలని టీఎస్యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. కేజీవీబీ, యూఆర్ఎస్లో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నా వారి వేతనాల అరకొరగానే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మూడు దశల పోరాటంలో భాగంగా యూటీఎఫ్ నాయకులు సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19న జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.