తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 83 మంది అభ్యర్ధుల జాబితాను సీపీఎం బుధవారం ప్రకటించింది. సీఎం పినరయి విజయన్ ధర్మదం నుంచి పోటీ చేయనుండగా, ఆరోగ్య మంత్రి కేకే శైలజ మత్తన్నూర్, ఉన్నత విద్యా మంత్రి కేటీ జలీల్ తవనూర్ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తారు. ఈ జాబితాలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంవీ గోవిందన్ మాస్టర్, కే రాధాకృష్ణన్, పీ రాజీవ్, కేఎన్ బాలగోపాల్ల పేర్లున్నాయి. సీపీఎం ప్రకటించిన జాబితాలో 12 మంది మహిళా అభ్యర్ధులకు చోటు దక్కింది.
మరోవైపు రెండు సార్లు ఎన్నికైన మంత్రులకు టికెట్లు నిరాకరించింది. ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్, టీఎం థామస్ ఇసాక్, ఈపీ జయరాజన్, ఆర్ రవీంద్రనాథ్, జీ సుధాకరన్, ఏకే బాలన్లకూ మొండిచేయి చూపింది. కొత్త అభ్యర్ధులకు అవకాశం ఇవ్వాలనే కొందరికి టికెట్ నిరాకరించామని పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శి ఏ విజయరాఘవన్ తెలిపారు. ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 6న ఒకే దశలో పోలింగ్ నిర్వహించి మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 140 అసెంబ్లీ స్ధానాలకు గాను సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 91 స్ధానాల్లో గెలుపొంది అధికార పీఠం చేజిక్కించుకుంది.