న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో అట్టుడికి పోతున్న దేశరాజధానికి శాశ్వత ఉపశమనం కలిగించే ప్లాన్ ఇది.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇందుకు స్కెచ్ గీశారు. ఢిల్లీ రాష్ట్ర ప్రజలందరికీ కరోనా టీకా వేయడం ఒక్కటే మార్గం. ఆక్సిజన్ విషయమై కేంద్రం మెడలు వంచిన కేజ్రీవాల్ ఇప్పుడు టీకాల కోసం డిమాండ్ చేస్తున్నారు. యావత్తు జనాభాకు టీకాలు వేయాలంటే నెలకు 85 లక్షల డోసుల చొప్పున మూడునెలలు కావాలని కేజ్రీవాల్ లెక్క తేల్చారు. ప్రస్తుతం ఢిల్లీలో రోజుకు లక్ష డోసులు ఇస్తున్నారు. చుట్టుపక్కల ఉండే ఫరీదాబాద్, గాజియాబాద్, సోనిపట్ వంటి ప్రాంతాల నుంచి ప్రజలు టీకాకోసం ఢిల్లీకి వస్తున్నారు. ఇక్కడి ఏర్పాట్లు నచ్చడమే అందుకు కారణం. సరైన మొత్తంలో డోసులు సరఫరా చేస్తే మూడు నెలల్లో మొత్తం జనాభాకు టీకాలు పూర్తి చేస్తామని కేజ్రీవాల్ అంటున్నారు. ఇప్పటివరకు తమకు 40 లక్షల డోసులు మాత్రమే అందాయని, ఇంకా 2.6 కోట్ల డోసులు కావాలని ఆయన స్పష్టం చేశారు. నెలకు 80-85 లక్షల డోసులు అందజేస్తే సరిపోతుందని లెక్కతేల్చారు. ఈమేరకు డోసులు సరఫరా చేయాల్సిందిగా ఆయన కేంద్రాన్ని కోరారు. కేంద్రం ఏంచేస్తుందో చూడాలి మరి.