ఆయుధం కన్నా ఆశయమే గొప్పదని చెప్తుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏ పని చేపట్టినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మొదలుపెట్టి అంతిమంగా విజయం సాధించాలంటారు. ఉమ్మడి పాలనలో విధ్వంసకర, విచ్ఛిన్నకర వాతావరణాన్ని కండ్లారా చూసిన మనం ఇవాళ తెలంగాణను చూస్తే నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా. కేవలం ఎనిమిదేండ్లలోనే తెలంగాణ ఈ స్థాయిలో ఉంటుందా అని ఎవ్వరూ ఊహించుకోలేదు కూడా. అందుకు కారణం ఒక్క కేసీఆర్. ఆయన ఆలోచన, ఆయన ఆశయం మాత్రమే.
దేశంలో సంస్కరణలు తీసుకురావాలని సాహసించిన ఏ ఒక్క పాలకుడినీ ఎక్కువకాలం అధికారంలో ఉండనీయని రాజకీయ వ్యవస్థ మనది. ఇలాంటి వాతావరణంలో రాజకీయాలకతీతంగా.. సమాజంలో సబ్బండవర్గాలకు సమష్టి ప్రయోజనం కలిగేలా భారీ ఎత్తున సంస్కరణలను ఏ పరిపాలకుడైనా చేపడుతారని ఊహించడం కూడా కష్టమైన పని. ప్రభుత్వాలు రాజకీయ నాయకులకు, కార్పొరేట్లకు, కాంట్రాక్టర్లకు మధ్య వ్యాపారలావాదేవీలు నిర్వహించే వ్యవస్థగా మారిపోయాయి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదంటే.. దానివెనుక రాజకీయ ప్రయోజనాలు, లెక్కలు తప్పకుండా ఉంటాయి. భిన్న సంస్కృతులు, భిన్నమతాలు, భిన్న జాతులున్న మన దేశంలో అన్నివర్గాలకు మేలు చేసేలా పరిపాలన జరిగింది లేనేలేదు.
రాజకీయ కోణంతో కాకుండా ప్రజల కోణం నుంచి పాలన జరిగినప్పుడే ఆ ప్రభుత్వానికి సార్థకత ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో గట్టి సంకల్ప బలంతో మన తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలని కలగన్నారో దాన్ని నిజం చేసే పాలనా ఆరంభించారు. సంస్కరణలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి రాజకీయ నిర్ణయాలన్నీ స్వల్పకాలంలోనే పూర్తి చేయడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
ప్రతీది క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం ద్వారా కేసీఆర్ సంస్కరణలు మొదలుపెట్టారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించారు కాబట్టి.. అనేక ఆటుపోట్లు తట్టుకొని నిలబడినారు కాబట్టి.. అదే ధైర్యంతో.. అంతే దూకుడుతో తెలంగాణను సంస్కరణల బాట పట్టించారు. పరిపాలనను వికేంద్రీకరించారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా మార్చారు. ఈ ఒక్క నిర్ణయంతో ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలంటే వందల కిలోమీటర్లు ప్రయాణం చేసే బాధ తప్పింది. ఇప్పుడు జిల్లా కేంద్రాలన్నీ కేవలం 30 కిలోమీటర్లలోపే ఉన్నాయి. ఇది ఆయన స్వీయానుభవంలోంచి వచ్చిన ఆలోచనే.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన మరో సంస్కరణ పంచాయతీరాజ్ వ్యవస్థను వికేంద్రీకరించడం. పంచాయతీరాజ్ చట్టాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, కొత్త చట్టం ద్వారా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక పరిపుష్టి గల పల్లెపట్టులను పునర్నిర్మాణం చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఒక్క నిర్ణయంతో ఇంతకాలం సమాజానికి దూరంగా, ఎవరూ పట్టించుకోకుండా విసిరేసినట్లు ఉన్న తండాలు, గూడేల్లో వెలుగు మొగ్గలు విరిశాయి. అవన్నీ స్వతంత్ర గ్రామ పంచాయతీలయ్యాయి. ఏ హక్కుల కోసం పీడిత సమాజం ఇంతకాలంగా ఎదురుచూసిందో. ఆ సమాజం సర్వ స్వతంత్రంగా పరిపాలనను చేపట్టింది. గత ఏడు దశాబ్దాల్లో ఏ ఒక్క పాలకుడూ చేయలేని, చేయడానికి సాహసించని అతి గొప్ప పరిపాలనా సంస్కరణ ఇది.
ఇప్పుడు కేసీఆర్ అసాధారణమైన, అనూహ్యమైన సంస్కరణ పథాన్ని ఎంచుకున్నారు. బహుశా భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా ఈ రకమైన నిర్ణయం తీసుకోవడానికి సాహసించి ఉండరు. మనది వ్యవసాయ దేశమని ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ.. ఇంతటి ప్రధానమైన వ్యవసాయరంగాన్ని ఇంతకాలం పట్టించుకున్న నాథుడే లేడు. రైతుబంధు, రైతుబీమా, రుణ మాఫీతో పాటు భూ సంపదకు జల సంపదను తోడుచేసి సేద్యానికి అవసరమైన మానవ వనరుల సంపదను సృష్టిస్తున్నారు. దేశంలో 70 శాతం మంది ప్రజలకు జీవనాధారమైన వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దానికోసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు తెలంగాణలో ఆవిర్భవించాయి. జలవనరులే మృగ్యమైన చోట గొలుసుకట్టు చెరువుల నీటి నిర్వహణా విధానంతో మూడు పంటల సుసంపన్న వ్యవసాయ రాష్ట్రంగా ఎదిగే మార్గంలో తెలంగాణ ముందుకుపోతున్నది. అందుకే ఇవాళ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో జాతీయ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెందించి దేశమంతా విస్తరింపజేస్తున్నారు. గతంలో పనిచేసిన ఏ పాలకుడికీ భూ సంస్కరణలు చేపట్టడం సాధ్యం కాలేదు. దీనికి కారణం రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం ఒకటైతే.. భూ రికార్డులు సక్రమంగా లేకపోవడం మరోకారణం.
చివరికి భూ సంస్కరణలు అన్న పదాన్ని ఉచ్ఛరిస్తే అదొక ముండ్లకంపగా భావించి ఏ పరిపాలకుడూ దాన్ని ముట్టుకోలేదు. అలాంటి సమస్యను ‘ధరణి’తో పరిష్కరించారు కేసీఆర్. అందుకే ఆయన మానవతకు మారు పేరు. ఆత్మీయతకు మరోరూపం. విశ్వాసానికి చిరునామా. ఆత్మ విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. పోరాటానికి పిడికిలి. కేసీఆర్… మూడక్షరాలే కానీ, తెలంగాణ ఉన్నంతకాలం ఆ పేరు సువర్ణ శోభితం.
ఉద్యమ నేతగా కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే కాదు, పరిపాలనా దక్షతతో రాష్ర్టాన్ని సిరిసింపదల నిలయంగా మార్చారు. 2014కు పూర్వం, 2104 తర్వాత పరిస్థితులు చూస్తే ప్రతీ పల్లెలో ఆయన చెరగని సంతకం ఉంటుంది. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు కట్టేందుకు ఏండ్లకేండ్లు పట్టాయని పెద్దలు చెప్తుంటారు. ఆ ప్రాజెక్టుల పనులు ఇంకా పూర్తి కాలేదు. కానీ మూడేండ్లలో కాళేశ్వరం పూర్తయింది. చివరి ఆయకట్టు వరకూ నీరందుతున్నది. పూర్తి కృష్ణ శిలతో యాదాద్రి రూపుదిద్దుకున్నది. కొత్త సచివాలయ నిర్మాణమూ పూర్తయింది. ఇలా ఒక్కటేమిటీ ‘రీ డిజైన్ తెలంగాణ రీ ఇన్నోవేషన్’ తెలంగాణలో అసాధ్యాలన్నీ సుసా ధ్యం అయ్యాయి. అది వన్ అండ్ ఓన్లీ సీఎం కేసీఆర్ వల్లనే.
– గుంటిపల్లి వెంకట్
94949 41001