తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి రాయాలంటే ఒక్క వ్యాసం చాలదు. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయ నాయకుడినీ, ఆయనలోని అసలైన నాయకుడినీ విశ్లేషిస్తే గానీ వారి వ్యక్తిత్వం గురించిన అవగాహన రాదు. ఈ రెండు పాత్రల లక్షణాలన్నీ పూర్తిగా పుణికిపుచ్చుకున్న మనీషి కేసీఆర్.
‘భరత్ అనే నేను’ అనే సినిమాలో ఒక చక్కటి మాట చెప్పాడు రచయిత. యువకుడైన భరత్ ఊహించని రీతిలో ముఖ్యమంత్రి అయి రాష్ట్రంలో ప్రజల భావనా శక్తికి అందని పథకాలు ప్రవేశపెడ్తాడు. అప్పుడు ఒక పోలీసు అధికారి తన కూతురితో అంటాడు … ‘ఈయన కూడా రాజకీయ నాయకుడే అనుకున్నానమ్మా! కానీ కాదు, ఈయన నాయకుడు!” అని. పై రెండు పదాలకూ తేడా తెలియనంత కలుషిత మయ్యాయి భారతదేశ రాజకీయాలు!
దాదాపు రెండు దశాబ్దాల ఉద్యమ నాయకుడిగా ప్రజల అనుమానాలు, ఎదురు పక్షాలు చేసిన అవమానాలు భరించి, వ్యక్తిగత దూషణలు స్వీకరించారు. రాష్ట్రీయ, భారతీయ పార్టీల ఎత్తులు, కుయుక్తులు ఎదిరించారు. చివరికి ఆరువారాల్లో ఇస్తామన్న తెలంగాణ ఆరేండ్లయినా ఇవ్వకుండా ఏడిపించిన పార్టీలకు పాఠాలు నేర్పి, రాష్ట్ర సాధనలో కృతకృత్యుడైన కేసీఆర్ విజయుడైన ఉద్యమనాయకుడిగా నిలిచారు. ఉద్యమాలు ప్రతిరంగంలో, ప్రతి దేశంలో జరుగుతాయి. కానీ ఇరవై సంవత్సరాలు పట్టు సడలించకుండా మోసపోయిన ప్రతిసారీ కొత్తపుంతలు తొక్కించటం సాధారణ మానవులకు సాధ్యంకాదు. మొదటి తెలంగాణ ఉద్యమంలో సహనం కోల్పోవడం, ఉద్యమకారులను హింసతో అణిచేయడం జరిగింది. అది పెద్ద పాఠంగా భావించి, మలి ఉద్యమాన్ని అత్యంత శాంతియుతంగా, తమ వైపునుంచి హింస జరుగకుండా ఇరువై ఏండ్ల పాటు నడిపిన ప్రతిభాశాలి కేసీఆర్! అదీ అసలైన ఉద్యమ నాయకత్వం! మహాత్మాగాంధీని కీర్తించినట్టే కేసీఆర్ని గుర్తించాలి.
రాజకీయరంగం: ‘యథా రాజా, తథాప్రజా’ అన్న నానుడి కేసీఆర్కి బాగా తెలుసు. ప్రజాహిత పథకాలు రచించడం రాజకీయ నాయకుడిగా ఆయన బాధ్యత. అయితే ప్రజలకు వాటి ఉద్దేశాలు వివరించి, వాటిని సరైన మార్గంలో ఎలా స్వీకరించాలో చెప్పటం కూడా కేసీఆర్ చేసే అత్యంత ముఖ్యమైన పని. ఆ పథకాల గురించి ప్రజలు చర్చించుకుని, అర్థం చేసుకుని సద్వినియోగం చేసుకోవలన్నది వారి ఆశయం. ప్రజల ఆలోచనా పటిమని పెంచడానికి ఉపయోగించే పక్రియ ఇది. ప్రజాస్వామ్యంలో ప్రజల అప్రమత్తతే వారికి శ్రీరామరక్ష అని గుర్తించి, దానికై పాటుపడుతున్న అసామాన్య రాజకీయ నాయకుడాయన. సాధారణంగా మతం పేరుతో, కులం పేరుతో ప్రజలని, ముఖ్యంగా యువతని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే నాయకులనే చూసిన భారతదేశం, ఇందుకు భిన్నమైన దార్శనికత ఉన్న కేసీఆర్ను అర్థం చేసుకోవాలి.
అధికారం చేతిలోకి వచ్చాక కేసీఆర్ పూర్తి చేసిన పథకాలను, ప్రజా సంక్షేమ విధానాలను ఇప్పుడు దేశమంతా గమనిస్తోంది. ఆయన ముఖ్యోద్ధేశ్యం మాత్రం ప్రజలను చైతన్యవంతులుగా, స్వతంత్రంగా ఆలోచించగలిగినవారుగా చేయడం. అందుకే ఏ ఎన్నికల ప్రసంగాలలోనైనా వారు తమ పార్టీకి ఓటేయమని అర్థించరు. వివిధ పార్టీలు ఇప్పటిదాకా తెలంగాణకు చేసిన మంచీ చెడూ విశ్లేషించి, తను ప్రవేశపెట్టిన పథకాలు అర్థం చేసుకుని ఎవరికి ఓటేయాలో, ప్రలోభాలకు లొంగకుండా, స్వతంత్రంగా నిర్ణయించుకోవాలని చెప్తారు. త్వరలో ప్రజలు ఆయన ఆశించిన ఈ స్వాతంత్య్రాన్ని సంతరించుకుంటారని ఆశిద్దాం!
సామాజికరంగం: రాష్ట్రమైనా, దేశమైనా సామాజిక సమానత్వం లేకపోతే ప్రగతి సాధించడం చాలా కష్టం. అతిపెద్ద ప్రజాస్వామ్యాలైన భారతదేశం, అమెరికాల మధ్య ఇదే పెద్ద భేదం. పరాయి దేశస్థుల వెయ్యేళ్ళ పాలనలో చాలా చారిత్రక తప్పిదాలు జరిగాయి. అందులో భారతదేశానికి జరిగిన ముఖ్యమైన నష్టం సనాతన ధర్మంలో ఎక్కడాలేని కులాల సృష్టి. దీన్ని వలస పాలకులు తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకుని శాశ్వతమైన చీలికలు భారతీయులలో కల్పించారు.
స్వాతంత్య్రానంతరం ఆ కులాల కుంపటిని ఆర్పి దేశంలో శాంతి నెలకొల్పాల్సిన జాతీయ పార్టీలు బ్రిటిష్వారి లాగానే కుల కుళ్ళు పెంచిపోషించి వారి మధ్య చిచ్చులుపెట్టి రాజకీయ చలిమంటలు కాచుకున్నారు. ప్రజల మధ్య శాంతి సౌహార్దాలు, దేశ ప్రగతికి వారి క్షేమం, భద్రత ఆవశ్యకం అనేది విస్మరించి, వారి మధ్య దూరం పెంచారు. కుల, జాతి, మతాలు తప్ప భారతీయులమనే సోయి లేకుండా తయారయ్యారు. యథారాజా, తథాప్రజా అన్నట్టు భాషా కుంపట్లు కూడా రగిలాయి. మరి కేసీఆర్ భావజాలంఏమిటి? గాంధీజీ మెచ్చుకున్న ‘గంగా జమునా తెహజీబ్’ అన్న సంయమనం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇతర రాష్ర్టాలలో భయకంపితులవుతున్న అల్ప సంఖ్యాక వర్గాలకు కేసీఆర్ జాతీయపార్టీ స్థాపన ద్వారా అభయమిచ్చారు. వారికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామంటున్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన కులాలకు, జాతులకి అనువైన పథకాలు ప్రవేశపెట్టి, వారి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించాలని కృషి చేస్తున్నారు.
కులవృత్తులకు ప్రాధాన్యం ఇచ్చి, నిధులు సమకూర్చి ప్రస్తుత తరాన్ని ఆదుకోవటమే కాదు, వారి పిల్లలకు ఉచిత విద్యా సౌకర్యాలు కల్పించి, ఉన్నత విద్యావంతులయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారు. తాళ్ళెక్కేవారికి, గొర్రెలు కాచేవారికి, బెస్త వారికి వారి వృత్తులు చేసుకునే వసతులు కల్పించారు. తండాలను పంచాయతీలుగా మార్చారు. దళితబంధు ద్వారా స్వీయ వృత్తులు, పొలంలేని వారికి వ్యాపారాలు చేసుకోవటానికి ప్రోత్సహిస్తున్నారు. ఏ జాతి, కులం వారిని వదలకుండా, అందరికి ఆర్థిక స్వాతంత్య్రం, సామాజిక గౌరవం, భద్రత కల్పించడానికి ఈ ఎనిమిదేళ్ళుగా కేసీఆర్ చేసిన కృషి ఫలితాలను ఇస్తోంది. ఈ సమసమాజ నిర్మాణం పదేళ్ళ పాటు సాగితే తెలంగాణ నందనవనమే!
సాంస్కృతిక పునరుజ్జీవం: ప్రజాకవి కాళోజీ చాలా విలువైన మాట ఒకటి చెప్పారు. ‘రాజకీయంగా వెనుకబడితే, మళ్ళీ పైకి లేవచ్చు, ఆర్థికంగా నష్టపోతే పూడ్చుకోవచ్చు. కానీ సాంస్కృతికంగా కూలిపోతే ఒక జాతి నిలబడడం చాలా కష్టం, దాదాపు అసాధ్యం’ అని. తెలంగాణా సంస్కృతి దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురి అయింది. భాషా పాండిత్యమేకాక, సాంస్కృతిక ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక, తెలంగాణ పునరుజ్జీవం జరిగింది. ముఖ్యమైన పండుగలు, తెలంగాణ భాష, ప్రసిద్ధ ఆలయాలు – అన్నీ కొత్త వెలుగులు సంతరించుకున్నాయి. కేసీఆర్గారి భక్తి శ్రద్ధలు, సంస్కృతిపట్ల అవగాహన, ఉద్ధరణకి చూపించిన పట్టుదలకు మరో పేరు చెప్పాలంటే- అశోకుడు, హర్షవర్థనుడు, శ్రీకృష్ణదేవరాయలు అని పురాతన చరిత్రలోకి వెళ్ళాల్సిందే! ఆరు దశాబ్దాల నష్టం అతి స్వల్ప కాలంలో పూడ్చటం వారి కఠోర కృషికి తార్కాణం కాదా! కేసీఆర్ తెలంగాణ సాధించకపోతే, ఇక్కడి ప్రజలు తలెత్తుకు తిరిగే పరిస్థితి ఉండేదా? బతుకమ్మ, బోనాలు, దసరా, దీపావళి వంటి అధిక సంఖ్యాకుల పండుగలే కాదు, గిరిజనుల పండుగలు, జాతరలకూ నిధులు కూర్చి, వసతులు కల్పించే నాయకుడిని ప్రజలు అభిమానించి, గౌరవించడంలో ఆశ్చర్యమేముంది?
విద్యారంగం: 2014 తరువాత విద్యా విధానాన్ని రాష్ట్రస్థాయిలో దార్శనికుడు, మేధావి అయిన మన ముఖ్యమంత్రి దారిలో పెట్టారు. పాఠశాల విద్యే కాక, ఉన్నత విద్య, విదేశాలలో విద్య గరపడానికి కూడా నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. గౌరవంగా, ఉన్నతంగా బతుకటానికి ప్రతివారికి వెసులుబాటు కల్పిస్తున్నారు. సామాన్య జనాలకు వైద్యం, విద్య ఉచితంగా అందించటం సమసమాజ స్థాపనకు దగ్గర మార్గం అనేది కేసీఆర్కు తెలుసు.
సంక్షేమ రంగం: సమాజంలో బలవంతులు బతుకటానికి ఏమీ అడ్డుండదు. కానీ ఆర్థికంగా, సామాజికంగా, లింగపరంగా బలహీనులు బతుకడమే చాలా కష్టం. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగినా కేసీఆర్కు సామాన్యుల కష్టాల పట్ల అవగాహన ఉంది. అందుకే వృద్ధులకు, ఒంటరి స్త్రీలకు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నారు. వలసపోయిన నేతన్నలను మాతృభూమికి రప్పించే కృషి చేసిన ఘనుడు కేసీఆర్. మనుషుల బతుకునే కాదు, మరణాన్ని కూడా అంతే గౌరవంగా చూడాలని అద్భుతమైన వైకుంఠ ధామాలు నిర్మించిన సున్నిత మనస్కుడు ఆయన.
అభివృద్ధిరంగాలు: అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి జోడు గుర్రాలుగా పరిగెత్తించే విధానాలు అమలుచేస్తున్న ప్రజ్ఞావంతుడు కేసీఆర్. బీదవారికి కేవలం డబ్బు వెదజల్లడం అన్నది కాకుండా పెరగటానికి, బతుకటానికి వసతులు కల్పించటం ముఖ్యమని తెలిసిన రాజకీయ వేత్త. అందుకే కేసీఆర్ను దేశమంతా గుర్తిస్తున్నది.
సంపూర్ణ వ్యక్తిత్వం: ప్రజ్ఞ కలిగిన వారు ప్రజల ప్రగతికి బాటలు వేయడం సహజమే! అయితే వారిలోని మానవీయ లక్షణాలు ప్రజాభిమానాన్ని చూరగొంటాయి. ఈ లక్షణాలు చాలా అరుదుగా, కొన్ని సందర్భాలలో మాత్రమే బహిర్గతమవుతాయి. అమరుడు శ్రీకాంతాచారి ఆరోగ్యం విషమించిందని తెలియగానే జయశంకర్ గారికి కేసీఆర్ ఫోన్ చేశారు. జయశంకర్గారితో నేను కూడా గాంధీ ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ శ్రీకాంతాచారి మృతదేహాన్ని చూసి కేసీఆర్ చలించిపోయారు. ఒక తండ్రిలా రోదించారు. అదీ మానవీయకోణం. జయశంకర్గారి పార్థివ దేహాన్ని చూసి ఒక కొడుకు తండ్రిని పోగొట్టుకున్నట్టు దుఃఖించారు. కనీసం రెండు గంటలు పట్టింది ఆయన కన్నీళ్ళు, రోదన ఆగటానికి. ఒక ప్రజ్ఞావంతుడైన రాజకీయ నాయకుడు, మేధావి, ఎన్నో అనుభవాలు పొందిన స్థిరచిత్తుడు అలా విలపించడం వారి సున్నిత హృదయానికి, అనుబంధాలకు ఇచ్చే విలువకు తార్కాణం కాదా? స్వార్థ ప్రయోజనాలకి యువతని బలిపెట్టే నాయకులని చూశాంగానీ, బంధుత్వంలేని యువకుడి మరణానికి చలించిపోయే నాయకుడిని చూశారా? మనుష్యులను ఓటర్లుగా చూసే నాయకులున్న ఈ కాలంలో కేసీఆర్వంటి సంపూర్ణ మానవుడిని ఇంకొకడిని చూడటం సాధ్యమా? మనిషికి ఆలోచనలను, ప్రజ్ఞను మెదడు ఇస్తే, సున్నితత్వాన్ని, భావోద్వేగాల్ని హృదయం కలిగిస్తుంది. ఈ రెండూ సరైన పాళ్ళలోవున్న మనిషే సంపూర్ణ మానవుడు. పరిస్థితులనుబట్టి అటువంటి మనిషి ఉద్యమాలని నడిపి ముఖ్యమంత్రి అయితే, ఆయన నాయకుడవుతాడు.
ఎత్తులు, పైఎత్తుల గురించి మాత్రమే ఆలోచించే రాజకీయ నాయకుడు కాడు. అటువంటి వారిని రాజనీతిజ్ఞుడైన నాయకుడనాలి. ప్రజా ్ఞపాటవాలు, మానవీయ లక్షణాలు రెండూ ఉన్న వాడే అటువంటి నాయకుడు.
వైద్యరంగం: ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అని పాడుకున్న సామాన్య ప్రజలకు ఇప్పుడు జిల్లాలో డయోగ్నస్టిక్స్, డయాలసిస్ వసతులు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్పత్రులను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా తీర్చిదిద్దటంతో కలెక్టర్ల, జడ్జిల కుటుంబాలు కూడా ప్రసూతికి ప్రభుత్వ ఆస్పత్రులను ఎన్నుకుంటున్నారు. సామాన్య కుటుంబాల్లోని గర్భిణీలకు, అంగన్వాడీలు పోషకాహారం అందిస్తున్నారు. కల్యాణలక్ష్మీ పథకంలో చదువు స్థాయికి, వయస్సుకు ఉన్న నిబంధనల వల్ల బాల్య వివాహాలు చాలా వరకు ఆగిపోయాయి. ఇంత సునిశితంగా ఆలోచించే మేధావి కేవలం రాజకీయ నాయకుడు కాడు, నిజమైన నాయకుడు.
వ్యవసాయ రంగం: ప్రపంచానికంతా అన్నం పెడతామని భాషణలు చేయకుండానే, ఆ స్థాయిలో వ్యవసాయాన్ని పండుగ చేసిన రాజకీయ నాయకుడు కేసీఆర్ ఒక్కరే! మనిషి ప్రాణాలు నిలిపేది అన్నం, నీరే! అందుకే ప్రపంచంలోఎక్కడాలేని పథకాలతో కృషీవలుడికి ప్రాణం పోసిన ధీరుడు ఆయన. రైతుబంధు వంటి పథకాలు ప్రవేశ పెట్టారు. నీటి పారుదల పథకాలతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన భగీరథుడు మన ముఖ్యమంత్రి. మంచినీటిని ప్రతి ఇంటికి అందించిన కేసీఆర్కు సామాన్య ప్రజలపట్ల అపార అభిమానాన్ని కొలవగలమా?
– కనకదుర్గ దంటు
89772 43484