Harish Rao | డిసెంబర్ మాసం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ సంతోషంగా ఉంటారని హరీశ్రావు అన్నారు. ఇది అత్యంత పవిత్రమైన మాసంగా భావించి నిత్యం పండుగలా జరుపుకుంటారని తెలిపారు. 2 వేల సంవత్సరాల క్రితం క్రీస్తు జన్మిస్తే ఇప్పటికీ వారిని ప్రార్థిస్తున్నామంటే వారి గొప్పతనం ఏమిటో చెప్పకనే చెప్పవచ్చని అన్నారు. సికింద్రాబాద్లోని సీఎస్ఐ వెస్లీ చర్చిలో గాడ్ విజన్ ఆధ్వర్యంలో మొదలైన క్రిస్మస్ సెలబ్రేషన్స్లో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఏసు ప్రభు ప్రేమ, దయా గుణం, కరుణ, శాంతిని అందరిలో పెంపొందించారని పేర్కొన్నారు. ఇవే మనిషిని ఉన్నతమైన స్థానానికి చేరుస్తాయని తెలిపారు.
ఉన్నతమైన స్థానం అంటే సంపద ఉండటమో, పదవి ఉండటమో కాదని హరీశ్రావు అన్నారు. గుణగణాలతో ఉన్నతంగా జీవించే వారే ఉన్నతమైన స్థానంలో ఉండేవారని వివరించారు. ఏసుప్రభు క్షమాగుణం అందరికీ ఆదర్శమని కొనియాడారు. తనను శిలువ వేసిన వారిని, తనను పట్టించిన వారిని కూడా క్షమించమని ప్రార్థించిన గొప్ప మహనీయుడు అని అన్నారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువమంది జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు. ఈ రోజు గాడ్స్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పండుగ సంబరాలు జరుపుకోవడం, అందులో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
మన దేశంలో క్రిస్మస్ పండుగను అధికారికంగా జరిపిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అని హరీశ్రావు అన్నారు. హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా అందర్నీ సమానంగా చూసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో క్రైస్తవ ముఖ్యమంత్రులు ఉన్నాగాని క్రిస్మస్ పండుగను అధికారికంగా జరపలేకపోయారని అన్నారు. బతుకమ్మ పండుగకు కొత్త చీరలు ఇచ్చినట్లు, ముస్లింలకు కూడా కొత్త బట్టలు పంపిణీ చేశారని.. అలాగే క్రైస్తవులకు కూడా క్రిస్మస్ పండుగకు బట్టలు పంపిణీ చేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. గతంలో క్రైస్తవుల సమస్యలను కేసీఆర్ పరిష్కరించారని గుర్తుచేశారు.
క్రైస్తవులకు సమాధుల కోసం స్థలాల కేటాయింపు విషయంలో రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా సరే మీరు తనను సంప్రదించవచ్చని హరీశ్రావు తెలిపారు. తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో సిద్దిపేటలో క్రైస్తవ భవనం నిర్మించడమే కాదు, హిందువులకు స్మశానవాటికలు, పార్థివ వాహనాలు ఇచ్చినట్టే క్రైస్తవులకు కూడా చివరి మజిలీ వాహనాన్ని అందించడం జరిగిందని తెలిపారు. కులాల మధ్య , మతాల మధ్య గొడవలతో మనుషులు సాటి మనుషులనే చంపుకునే పరిస్థితి ఏర్పడిందని.. అందరూ ద్వేషాలు మరిచిపోయి ఏసుప్రభు స్ఫూర్తితో క్షమాగుణంతో ఉండాలని సూచించారు. అందరూ సహనంతో ఉండాలని.. ప్రేమను పంచుకోవాలన్నారు.
టీవీలు, పేపర్లు చూస్తే.. ఒకరిపై ఒకరు హత్యాప్రయత్నాలు, ఒక మతంపై ఇంకో మతం పెత్తనం, ఇక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించాలని ప్రయత్నం… ఇవే వార్తలు కనిపిస్తున్నాయని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి లేకపోతే ప్రపంచం అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉందని అన్నారు. కొన్ని శక్తులు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుంటాయని తెలిపారు. మతం కంటే మానవత్వం గొప్పదని.. ఉన్నతమైన విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించడమే అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఏసుప్రభు మాటలు, సూక్తులు వినడమే కాదు వాటిని ఆచరించి మంచి సమాజాన్ని పెంపొందించాలని కోరారు. క్రైస్తవుల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీపక్షంగా నా వ్యక్తిగతంగా కూడా కృషి చేస్తానని తెలిపారు.