తెలంగాణకు వెల్లువెత్తుతున్న పెట్టుబడులు, సాకారమైన జిల్లాకో వైద్య కళాశాల, పాలమూరు-రంగారెడ్డి శుభారంభం… ఈ అద్భుతాలను ఏ మీడియా దాచగలదు? ఇంత ఆనందంలోనూ దరిద్రం ఏమంటే ‘ఊరందరిదీ ఒక చింతయితే ఉలిపి కట్టెది మరొకటి’ అన్నట్టు సెప్టెంబర్ 17 పేరుతో బీజేపీ దుర్మార్గ మత విద్వేష క్రీడతో ముందుకు వచ్చింది.
అంతలోనే మినుకుమని ఆశాదీపం కనిపించింది. అదేమంటే… మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు ఈసారి జరపడం లేదని, వినాయక నిమజ్జనం అదే రోజు ఉండటంతో సంఘ వ్యతిరేక శక్తులు చొరబడి అలజడులు సృష్టించకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని సీరత్-ఉన్-నబీ అకాడమీ బాధ్యులు గులాం సందాని అలీ ఖాద్రీ వెల్లడించారు. ఎంత గొప్ప ఆలోచన! ఈ నిర్ణయంలో యువతదే ఎక్కువ పాత్ర ఉండటం అత్యంత ఆనందదాయకం. ఇది కదా తెలంగాణ. ఇది కదా గంగా జమునా తెహ్జీబ్.
మత సామరస్య భావన అణువణువునా నిండి ఉన్న సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించిన్రు! రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. సువిశాల భారతావనిలో తెలంగాణ అంతర్భాగమైన రోజుగా, రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన సుదినంగా మంత్రి కేటీఆర్ ఈ రోజును అభివర్ణించిన్రు. అందరూ ఒకటే మాటగా సమైక్యతా బాట పట్టడం యథా రాజా తథా ప్రజాకు ఒక కొత్త పాజిటివ్ అర్థం. పాలకులు సరైన రోల్మాడల్గా ఉంటే ప్రజలూ ఆ ఆలోచనా ధారలో భాగం అవుతారు. ‘సమైక్యత అనే పదం ఎక్కడుందో చెప్పాలి’ అని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి ఎకసెక్కాలు ఆడిన్రు. అది ఆయన డొల్లతనాన్ని బయటపెట్టుకోవడానికి తప్ప మరి దేనికి పనికి రాదు.
సాంస్కృతిక వ్యవహారాలు చూసే మంత్రిగా భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతుల గుల్ దస్తా లాంటి దేశాన్ని సమైక్యంగా ఉంచాల్సిన బాధ్యత కలిగిన ఆయన అవన్నీ మరచి అసలు సమైక్యతా భావననే ప్రశ్నించడం మరుగుజ్జుతనం! వారి పార్టీ ఏడాదికోసారి తూతూమంత్రంగా సెప్టెంబర్ 17 కథ నడిపిస్తుంది. తెలంగాణ స్వపరిపాలనా విజయం సిద్ధించిన రోజు కూడా వారికి గుర్తు రాదు, ఇష్టం లేదు. సాక్షిగా నేటికీ తెలంగాణపై విషం కక్కుతూ ఉంటరు ప్రధానమంత్రి. వీరికి ‘విమోచన’ ఒక కపట నాటకం! ప్రజలను రెచ్చగొట్టే దుస్తంత్రం. ఏండ్లుగా, పూండ్లుగా వీరు ఈ నాటకం ఆడుతనే ఉన్నరు, వారి గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతనే ఉన్నది. అందుకు కారణం ఈ నేల బిడ్డల సామరస్య జీవన భావన! కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక్కసారైనా అద్దం ముందు నిలబడి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచన!
ప్రజలారా! ముస్లింలను ప్రజా కంటకులుగా నిలబెట్టే కుటిల రాజకీయాల్లో భాగమే ‘విమోచన’ తంత్రం. అందుకు విరుగుడే కేసీఆర్ సమైక్యతా పిలుపు. ఇక కాంగ్రెస్, బీజేపీ ఈ అంశంలో దొందూ దొందే. ముస్లింలను విడిగా, హిందువులను విడిగా ఓటు బ్యాంకులుగా స్థిరపరచుకుని, దివాళాకోరు పాలనతో ఆరేడు దశాబ్దాలుగా దేశాన్ని ఇంకా ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గానే ఉంచింది వీరు కాదా? సామాన్యుల బతుకులు నానాటికీ తీసికట్టుగా మార్చింది వీరు కాదా? తుక్కుగూడ సభకు వచ్చే కాంగ్రెస్ అగ్రనేతలు దీనికి సమాధానం చెప్తారా? రేవంత్ లాంటి మతోన్మాద భావజాలం అణువణువునా ఉన్న నాయకుడి చేతిలో మీ పార్టీ పగ్గాలు పెట్టి ఏమి వెలగబెడుతరు తెలంగాణకు? ఏనాడైనా పదేండ్ల తెలంగాణ విజయాల ఒరవడి దేశంలో కనిపించిందా మీ పాలనలో? 1969లో ఇందిరాగాంధీ ఇచ్చిన గరీబీ హటావో నినాదానికి నేటికీ ప్రాసంగికత ఉన్నదంటే దోషం మీది కాదా? కేసీఆర్ లాగా విద్య, ఉద్యోగం, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం అంటూ ఈ జాతీయ పార్టీలు ఒక్కటైనా తపించిన దాఖలాలున్నయా? కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. పాలమూరు-రంగారెడ్డి మరో కొత్త చరిత్ర లిఖిస్తున్నది. పాలన అంటే ఇది కదా!
ఈ దేశంలో ముస్లింల జీవితాలు దళితుల కంటే కూడా దయనీయమైన స్థితిలో ఉన్నాయని రాజేంద్ర సచార్ కమిటీ దశాబ్దాల కిందటే చెప్పింది. ఎందుకు ఈ దేశంలోని ఒక వర్గం దుర్భర దారిద్య్రంలో మగ్గిపోవాలి? వారిని అర్థం చేసుకుని చేరదీసి, అభివృద్ధి-సంక్షేమంలో భాగస్వాములను చేయడం మన బాధ్యత కాదా? పేద హిందూ యువతుల కోసం కల్యాణలక్ష్మి, పేద ముస్లిం అమ్మాయిల కోసం షాదీముబారక్ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. దీంతో మైనారిటీ తీరని అమ్మాయిలకు పెండ్లిండ్లు చేయడం ఆగిపోయింది. దళితుల స్వావలంబన కోసం ఎంత తపిస్తున్నారో, ముస్లింల కోసమూ అంతే తపిస్తున్నరు సీఎం కేసీఆర్. మిత్రులారా… కేసీఆర్ మార్గమే మనందరిది కూడా. మనకు షీర్ కుర్మా ఇవ్వనిదే షరీఫ్ భాయ్ రంజాన్ పండుగ చేసుకున్నడా ఎప్పుడైనా? వినాయక మండపాలకు స్వాగతం పలుకుతూ పులిహోర ప్యాకెట్లు పంచే జలీల్లు మీకు ఎంత మందో తెలుసు కదా? మనం ప్రజలుగా ఇంత బాగుంటే… ‘మీరు వేసుకున్న బట్టలను బట్టి మీ ఆలోచనలను ఊహించగలను’ అని ఈ దేశ ప్రధాని అనడం ఎంత దుఃఖదాయకం? ముస్లింలను టార్గెట్ చేయటమేనా దేశభక్తి? ఏటా సెప్టెంబర్ వస్తే చాలు, నిజాం పేరు మీద మంట రగల్చడమేనా? ముస్లింలకు నిజాం ఒరగబెట్టి ఉంటే, పేద ముస్లిం పిల్లలు బడిలో మధ్యాహ్న భోజనం కోసం దయనీయంగా ఎదురుచూసే రోజులు ఇంకా ఉండేవా? అందరూ ఒక్కటిగా సమైక్యతా భావనతో ఉంటటం కంటకమా మీకు?
‘నేను భగవంతుడిని బాహాటంగా ప్రేమిస్త; ఎవరికీ భయపడను; శషభిషలు ఉండవు నాకు; విశ్వాసం, ప్రేమ, ఆధ్యాత్మిక భావంతో ఉంట. నా దృష్టిలో గుడి ఒక గొప్ప కమ్యూనిటీ సెంటర్’ -అన్నరు కేసీఆర్ మూడు సంవత్సరాల క్రితం చాగంటి కోటేశ్వరరావు భాగవత సప్తాహంలో ప్రసంగిస్తూ. దానికి చాగంటి వారు స్పందిస్తూ- కేసీఆర్ గారు ధర్మాన్ని త్రికరణ శుద్ధితో ఆచరిస్తారు కాబట్టే తెలంగాణ సుఖశాంతులతో అలరారుతున్నదని అన్నారు. ఇది కదా ధర్మనిరతి! స్వధర్మం పట్ల ఎంత బద్ధుడో, ఇతర ధర్మాల పట్ల అంతే గౌరవం కలవారు కేసీఆర్. హిందూ ధర్మానికి మానస పుత్రులుగా చెప్పుకొని తిరిగే బీజేపీ వారికి కేసీఆర్కు తేడా ఇదే. ఆ రోజు కేసీఆర్ ప్రసంగ వీడియో చూసి.. హిందూ ధర్మాన్ని తమ కంటే ఎక్కువ ఆచరిస్తున్న కేసీఆర్పై బీజేపీకి అందుకే కోపమని ఒక వ్యాఖ్యాత అన్నారు.
సంపద సృష్టించడానికి కేపిటలిజం అవసరం. అది పేదలకు పంచడానికి సోషలిజం అవసరం. అందుకు ప్రజా రాజకీయాలు అవసరం. రెండో దానికి దూరం జరిగిన నాయకులకు ఆదరణ ఉండదు. తమ అనుంగు సంపన్నులకు బెయిల్ అవుట్ ప్యాకేజీలు ఇస్తూ, పేదలకు ఇచ్చే రాయితీలను ఉచితాలని ఎద్దేవా చేసే కిషన్రెడ్డి పార్టీకి అందుకే ‘సమైక్యత’ అనేది అర్థం కాదు. అందరూ కలిసి ఉండటమూ అర్థం కాదు. కేసీఆర్ ఈ సిద్ధాంత(డాైక్ట్రిన్) పరిధిని కూడా దాటి చాలా ముందుకు పోయారు. తన కాలానికన్నా ఎంతో ముందు ఉన్నారు ఆయన. కాబట్టే, సమైక్యతా దినోత్సవం జరిపే హక్కు, బాధ్యత కేసీఆర్కు తప్ప మరెవరికీ లేదు. మనమందరం సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవంలో అమర వీరులను స్మరించుకుందాం. పెద్ద ఎత్తున భాగస్వాములవుదాం. ప్రతి అంశాన్ని మతంతో ముడిపెట్టి సమాజంలో చిచ్చుపెట్టే విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను తిప్పి కొడదాం.
కవి ఆత్రేయ మాటలతో ముగిస్తా:
సహ జీవనము సమ భావనము
సమతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము
లక్ష్యములైన విలక్షణ భూమి
భారత మాతకు జేజేలు, బంగరు భూమికి జేజేలు!
అట్టి ధీరులకు ఘన నీరాజనాలు! చివరిగా ఒక మాట. మనుషులను మనుషులుగా ప్రేమిద్దాం. కులం-మతం ఆధారంగా విద్వేషాలు వద్దు. గాయాలు తవ్వుకోవద్దు. కుటుంబంలో ఉండే పాత మచ్చలను మరచిపోమా? సమాజం కూడా మన కుటుంబమే. అందరం కలిసి ఉందాం. సమైక్యతా దినోత్సవ స్ఫూర్తి ఇదే. జై హింద్.
– శ్రీశైల్రెడ్డి పంజుగుల, 90309 97371