పుట్టగొడుగులు శాకాహారుల మాంసాహారం. పోషకాల పుట్ట. మార్కెట్లో వాటి ధర మరింత పెరుగుతుందే కానీ, భారీ పతనం ఉండదు. అందుకే, అనేక అధ్యయనాల తర్వాత ఆమె పుట్టగొడుగుల సాగుకు మొగ్గు చూపింది. ఐదు కేజీలు పండిస్తేనే గొప్ప అనుకునే పరిస్థితి నుంచి రోజుకు యాభై కిలోలు అవలీలగా ఉత్పత్తి చేస్తున్నది ఖమ్మం జిల్లా తెల్దారుపల్లికి చెందిన సిరికొండ కావ్య. ఆ ‘మామ్ప్రెన్యూర్’ స్థాపించిన ఆర్ఆర్ మష్రూమ్స్ లాభాల పంట పండిస్తున్నది.
ఖమ్మం జిల్లాకు చెందిన కావ్య బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్) చదివింది. ఓ ఇంజినీరింగ్ కాలేజ్లో ఏడాదిపాటు ఉద్యోగం చేసింది. అంతలోనే వివాహమైంది. వెంటనే పాప పుట్టడంతో కొలువు వదిలేసింది. ఇంట్లోనే ఉంటూ చిన్నారి ఆలనాపాలనా చూసుకుంది. ఓ దశలో మనసు మళ్లీ ఉద్యోగం వైపు మళ్లింది. తాను సంపాదించడమే కాదు, మొత్తంగా మహిళల ఆర్థిక సాధికారత కోసం ఏదైనా చేయాలనుకుంది. ఆ సమయంలో ఎక్కడో చదివిన మామ్ప్రెన్యూర్స్ విజయగాథలు గుర్తుకొచ్చాయి. మాతృత్వం తర్వాత.. కొత్త కంపెనీలు స్థాపించి ఘనవిజయం సాధించిన మహిళలు ఎంతోమంది. ఆ మనోబలంతోనే వ్యాపారంవైపు అడుగులు వేసింది. ఆమె తల్లిదండ్రులు, అత్తమామలది కూడా వ్యవసాయ కుటుంబమే కావడంతో.. ఆ దిశగా ప్రయత్నిద్దామని తీర్మానించింది. అనేక అధ్యయనాల తర్వాత లాభసాటిగా ఉండే అగ్రి బిజినెస్పై దృష్టిపెట్టింది. ఆ ప్రయత్నాల్లో పుట్టుకొచ్చిందే ‘పుట్టగొడుగుల సాగు’.
రోజుకు ఐదు కేజీలతో..
2019 ఏప్రిల్లో నేరుగా సాగులోకి దిగింది కావ్య. రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక, తక్కువ మొత్తంలో సాగు ప్రారంభించింది. ఈ క్రమంలో ఖమ్మం ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ద్వారా మార్కెటింగ్ అవకాశాల గురించి తెలుసుకున్నది. మొదట్లో రోజుకు నాలుగైదు కేజీలు సాగు చేద్దామని భావించింది. కానీ అందులోని లాభాలు ఆశ్చర్యపరిచాయి. ఎలాగైనా సాగుతో పాటు, మార్కెట్నూ విస్తరించాలనుకుంది. ఈ క్రమంలో భర్త, తల్లిదండ్రుల సాయంతో.. సాగు, మార్కెట్ గురించి లోతైన అధ్యయనం చేసింది. హైదరాబాద్లోని వీహబ్కు కాల్ చేసింది. తన ఆలోచనలను పంచుకుంది. సాయం కోసం దరఖాస్తు చేసుకుంది. వారం రోజుల తర్వాత.. వీహబ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో హైదరాబాద్ వెళ్లి సంబంధిత అంశాలపై శిక్షణ తీసుకుంది. అప్పుడే బిజినెస్ మేనేజ్మెంట్, వర్క్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్కు సంబంధించి సూచనలు అందించింది వీహబ్. ప్రత్యేకించి ఒక మెంటర్ను కూడా కేటాయించింది.
శిక్షణ అనంతరం మళ్లీ లాంచ్ప్యాడ్ ఈవెంట్కు ఎంపిక చేసింది. అక్కడ తన వ్యాపార ప్రణాళికను వివరించడంతో.. ఓ ఇన్వెస్టర్ ముందుకొచ్చారు. అలా వీహబ్ ద్వారా తనకు కావాల్సిన పెట్టుబడి అందింది. మొదట్లో ఐదారు కేజీల ఉత్పత్తి వస్తేనే హడలిపోయేది కావ్య.. ఇప్పుడు రోజుకు 30-40 కేజీల దిగుబడి వచ్చినా.. సరిపోని పరిస్థితి. దీంతో సాగును విస్తరించేందుకు సన్నాహాలు చేసింది. ప్రస్తుతం తన లక్ష్యానికి తగినట్టుగానే రోజుకు 50 కేజీల దిగుబడిని సాధిస్తున్నది. సూపర్ మార్కెట్లు, పెద్దపెద్ద షాపింగ్ మాల్స్తో ఒప్పందం కుదుర్చుకోవడంతో.. మెరుగైన లాభాలు వస్తున్నాయి. కేరళ, హైదరాబాద్, విజయవాడ, చెన్నై తదితర ప్రాంతాలకు బల్క్ ఆర్డర్లను సరఫరా చేస్తున్నది కావ్య. మష్రూమ్ పౌడర్, పచ్చళ్లు, బిస్కెట్లు, ఇన్స్టెంట్ సాస్, సూప్ మార్కెట్లో పరిచయం చేయాలన్నది ఆమె ఆలోచన.
వీహబ్ ఓ ధైర్య పతాక
పుట్టగొడుగుల సాగు ప్రారంభించిన మొదట్లో నేను ఓ ఆంత్రప్రెన్యూర్ అవుతానని అస్సలు ఊహించలేదు. అంత ధైర్యం కూడా నాకు లేదు. సాగులోకి దిగి.. అందులోని లోటుపాట్లు తెలుసుకున్నాకే నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. వీహబ్ను సంప్రదించడం నా జీవితంలో మరో మలుపు. అక్కడ శిక్షణ తీసుకున్న తర్వాత.. నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. వ్యాపార ఆలోచన ఉన్న ప్రతి మహిళా వీహబ్ ద్వారాలు తట్టాల్సిందే.
– సిరికొండ కావ్య, ఆర్ఆర్ మష్రూమ్స్