ప్రస్తుతం హిస్టారిక్, పీరియాడిక్ సినిమాల ట్రెండ్ నడుస్తున్నది. అగ్ర హీరోలు ఈ తరహా చిత్రాల్లో భాగమవుతూ ప్రాజెక్ట్లపై క్రేజ్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో మరో భారీ హిస్టారికల్ థ్రిల్లర్ చిత్రానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రేమమ్, కార్తికేయ సిరీస్ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
అక్షయ్కుమార్, రానాతో పాటు మరో బాలీవుడ్ హీరో భాగం కానున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కరణ్జోహార్ తెరకెక్కించబోతున్నారు. ఉజ్జయిని నేపథ్యంలో చరిత్ర, ఆధ్యాత్మికత, ధార్మిక అంశాలు కలబోసిన థ్రిల్లర్ కథాంశమిదని, విజువల్ ఎఫెక్ట్స్కు అధిక ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ప్రస్తుతం చందు మొండేటి యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘వాయుపుత్ర’ను రూపొందిస్తున్నారు.