తెలుగు సినీరంగంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకనిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు (71) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. త్రిపురనేని చిట్టిబాబు అసలు పేరు వరప్రసాద్. 1955 జూలై 28న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో జన్మించారు. చెన్నైలో విద్యనభ్యసించారు. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి కుమారుడే చిట్టిబాబు. తన 17వ ఏట సహాయ దర్శకుడిగా సినీరంగంలోకి ప్రవేశించారు. ‘సంతానం’ (1984) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా విజయవంతమై చిట్టిబాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత దుర్గ, ప్రళయం, ప్రేమించి చూడు, రైతు భారతం వంటి వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకత్వంలో పాటు చిన్న పాత్రల ద్వారా నటుడిగా కూడా రాణించారు. గరుడాచలం, భైరవద్వీపం, దశావతారం, జాతిరత్నాలు, జాంబీరెడ్డి, దర్జా వంటి చిత్రాల్లో సహాయ పాత్రల్లో మెప్పించారు.
దివంగత కథానాయిక సౌందర్యని తెలుగు సినీరంగానికి పరిచయం చేశారు చిట్టిబాబు. ఎందరో దర్శకులకు అవకాశాలు ఇప్పించి సహృదయుడిగా పేరు తెచ్చుకున్నారు. 12 సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు 30 చిత్రాల్లో నటుడిగా మెప్పించారు. నిర్మాతగా కూడా పలు చిత్రాల్ని నిర్మించారు. తండ్రి వారసత్వంగా తొలుత కమ్యూనిస్ట్ భావజాలంతో కొనసాగిన ఆయన అనంతర కాలంలో వివిధ పార్టీల్లో పనిచేశారు. 1998లో బీజేపీలో చేరారు. సినీరంగంతో పాటు రాజకీయ విశ్లేషకుడిగా కూడా చిట్టిబాబు పేరు తెచ్చుకున్నారు. టీవీ చర్చల్లో నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసేవారు. ఆయన మాటలు వివాదాలకు దారితీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. త్రిపురనేని చిట్టిబాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.