హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పవర్లెస్గా (శక్తిహీనం) మారిపోయింది. మోదీ సర్కారు అసమర్థ విధానాలతో దేశంలో తీవ్ర విద్యుత్తు కొరత నెలకొన్నది. కరెంటు కోతల్లో గుజరాత్ తరువాత మరో బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరు తన ఘనతను చాటుకొంటున్నది. వేళాపాళా లేకుండా విధిస్తున్న కరెంటు కోతలు, పవర్ హాలిడేలతో విసిగివేసారిన అక్కడి పారిశ్రామికవేత్తలు.. కంపెనీలు నడవక నానా అవస్థలు పడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా గంటలకొద్దీ విద్యుత్తు కోతలు విధిస్తున్న అధికారులపై మండిపడుతున్నారు.
బెంగళూరు-మైసూరు రోడ్డులోని కుంభలగోడు ఇండస్ట్రియల్ ఏరియాలో కరెంటు కోతల కారణంగా ఉత్పత్తులు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో అక్కడి పారిశ్రామికవేత్తలు బెంగళూరు ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ లిమిటెడ్ (బెస్కాం) అధికారులకు హారతి పట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. సింధూరంతో తిలకం దిద్ది, దండలు వేసి.. ‘అయ్యా.. ఇప్పటికైనా కరెంటు కోతలు లేకుండా చూడండి’ అని వేడుకొన్నారు. టెక్ నగరంగా పిలిచే బెంగళూరులో కరెంటు కష్టాలను ప్రభుత్వం ఎందుకు తీర్చడం లేదంటూ ప్రశ్నించారు. విద్యుత్తు కోతలు ఇలాగే కొనసాగితే, పరిశ్రమలు ఎలా నడిపేదన్నారు.
ఐటీలో మనకు సాటిలేదని చెప్పుకునే బెంగళూరులో ఏమిటీ విద్యుత్తు కోతలు? అని అధికారులను నిలదీశారు. మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పెట్టుబడులను ఆహ్వానిస్తూ కర్ణాటక మంత్రులు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారని, ఉన్న కంపెనీలకే కరెంటు ఇవ్వలేని ప్రభుత్వం కొత్తగా వచ్చేవారికి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఈ వినూత్న నిరసన కార్యక్రమం కెంగెరి బెస్కాం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం(ఏఈఈ)లో గత గురువారం జరిగింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన ఈ వార్తను సోమవారం మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ ‘పవర్లెస్ డబుల్ ఇంజన్ సర్కార్’ అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. పారిశ్రామికవేత్తలు విద్యుత్తు అధికారులకు హారతి పడుతున్న ఫొటోను మంత్రి ట్విట్టర్లో పోస్ట్చేశారు. కాగా, పరిశ్రమలు నడవడానికి మూలాధారమైన విద్యుత్తు సంక్షోభం రాష్ట్రంలో కొనసాగుతుంటే.. పెట్టుబడులకు బెంగళూరు స్వర్గధామమని, విదేశీ సంస్థలకు కావలసిన అన్ని వసతులు నగరంలో ఉన్నాయని ఢిల్లీలో ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్లో సీఎం బసవరాజ్ బొమ్మై ఆర్భాటంగా ప్రకటించడం గమనార్హం.
సగం ఆదాయం డీజిల్ ఖర్చుకే
కొవిడ్ సంక్షోభం సద్దుమనుగడంతో డిమాండ్ పెరిగి చిన్న పరిశ్రమలు ఇప్పుడిప్పుడే ఉత్పత్తిని పెంచుతున్నాయని కియా అధ్యక్షుడు ఎస్ బాబు అన్నారు. అయితే విద్యుత్తు కోతల కారణంగా జనరేటర్లతో పరిశ్రమలను నడుపడంవల్ల తమకు వస్తున్న ఆదాయంలో సగం డీజిల్ ఖర్చులకే సరిపోతున్నదని తెలిపారు. మెట్రో కనెక్టివిటీ ఉండి, పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్న తమ పారిశ్రామికవాడలోనే విద్యుత్తు సరఫరా సరిగా లేకపోతే, మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఎలావుందో అర్థం చేసుకోవచ్చని వివరించారు. కాగా, బెస్కాం డైరెక్టర్ నాగార్జున విద్యుత్తు సమస్యపై మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి మరో మూడు, నాలుగు నెలలు పట్టవచ్చని చావు కబురు చల్లగా చెప్పడం విశేషం. కొత్త ఫీడర్ ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నట్లు, అది ఏర్పాటైతే సమస్య పరిష్కారమవుతుందని ఆయన వివరించారు.
700 పరిశ్రమలపై తీవ్ర ప్రభావం
విద్యుత్తు కోతలతో కుంభలగోడు పారిశ్రామిక వాడలో ఉన్న 700 పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడి మూసివేసే పరిస్థితి దాపురించినట్టు కుంభలగోడు ఇండస్ట్రీస్ అసోసియేషన్ (కియా) ప్రధాన కార్యదర్శి కమలేశ్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పారిశ్రామికవాడ గ్రామీణ ఫీడర్తో అనుసంధానం చేయడంవల్ల విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్టు తెలిపారు. దీన్ని మార్చి అండర్గ్రౌండ్ కేబుళ్లు వేసేందుకు రూ. 45 కోట్లు ఖర్చవుతుందని స్థానిక ఇంజినీరు ప్రతిపాదన పంపినప్పటికీ ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తమ పారిశ్రామికవాడ నుంచి ప్రభుత్వానికి అందుతున్న ఆదాయంలో పావువంతు ఖర్చుచేసినా తమకు భూగర్భ కేబుల్ లైన్ ఏర్పాటుచేయవచ్చని, అయినా ప్రభుత్వం నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.