బెంగళూరు, ఫిబ్రవరి 23: రాష్ట్ర బడ్జెట్లో తమ జీతాల పెంపునకు నిధులు కేటాయించకపోవడంతో మార్చి 1 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించారు. ప్రభుత్వం ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తుందని ఉద్యోగులు పెట్టుకున్న ఆశలపై సీఎం బొమ్మై నీళ్లు చల్లారు. దీంతో వారు సమ్మె బాట పట్టనున్నారు. వారం లోగా శాసన సభలో జీతాల పెంపునకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప సమ్మె ఆలోచన విరమించుకొనే ప్రసక్తే లేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తేల్చి చెప్పింది. ఉద్యోగుల డిమాండ్పై సీఎం కార్యాలయ అధికారి ఒకరు స్పందిస్తూ ముఖ్యమ్రంతి సమాధానం కోసం వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు. వేతన సంఘం సిఫార్సుల అమలుతో పాటు పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని, కనీసం 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.