DK Shivakumar | హైదరాబాద్, ఆగస్టు 9, (నమస్తే తెలంగాణ-స్పెషల్ టాస్క్ బ్యూరో): కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అయింది కర్ణాటక రాష్ట్ర ప్రజల పరిస్థితి. 40 శాతం కమీషన్ సర్కారుగా పేరొందిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి, కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే.. మూడునెలలు కాకుండానే సిద్ధరామయ్య సర్కారుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెండింగ్ బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమను 10 నుంచి 15 శాతం కమీషన్ అడుగుతున్నారని బృహత్ బెంగళూర్ మహానగర పాలిక (బీబీఎంపీ) కాంట్రాక్టర్ల సంఘం సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు వారు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం శివకుమార్ ఆర్థిక మంత్రే కాకుండా బెంగళూర్ నగర అభివృద్ధి శాఖలను కూడా నిర్వహిస్తున్నారు.
కమీషన్లు లేకుండా బిల్లులు అయినా విడుదల చేయించండి.. లేనిపక్షంలో తమను కారణ్య మరణాలకైనా అనుమతించండని కాంట్రాక్టర్ల సంఘం డిమాండ్ చేయడం కర్ణాటక సర్కారును కుదిపేస్తున్నది. అవినీతిరహిత పాలన అందిస్తామని కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్కు 10 నుంచి 15 శాతం కమీషన్ అడగటమేనా? అవినీతిరహిత పాలన అని కాంట్రాక్టర్ల సంఘం నిలదీసింది. గవర్నర్కు ఫిర్యాదు చేసిన తర్వాత సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. పెండింగ్ బిల్లుల మంజూరుకు తమ వద్ద డబ్బులు లేవని ప్రభుత్వం అబద్ధం ఆడుతున్నదని సంఘం అధ్యక్షుడు మంజునాథ్ ఆరోపించారు. తమకు బకాయిపడింది రూ.675 కోట్లు కాగా బెంగళూర్ మహానగర పాలక వద్ద రూ.1500 కోట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. బిల్లులు చెల్లించాలంటే సంబంధిత మంత్రి అయిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు 10 నుంచి 15 పర్సేంటేజి ఇవ్వాలని అధికారులు అంటున్నారని వారు వివరించారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరినట్టు వారు వివరించారు.
కాంట్రాక్టర్ల సంఘం చేసిన ఆరోపణ పూ ర్తిగా రాజకీయ ప్రేరేపితమైందిగా డీకే శివకుమా ర్ ఖండించారు. ఈ ఆరోపణల వెనుక బీజేపీ, జేడీఎస్ నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. జరిగిన పనులు ఏ విధంగా ఉ న్నాయో పరిశీలించకుండా బిల్లులు ఎలా విడుదల చేస్తామని ఆయన ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు పరిశీలించి అవి సక్రమంగా ఉన్నాయో లేవో నివేదిక ఇవ్వాల్సిందిగా లోకాయుక్తను కో రనున్నట్టు శివకుమార్ మీడియాకు తెలిపారు. తనపై ఆరోపణలు చేయడానికి ముందు కాం ట్రాక్టర్ల సంఘం నాయకులు ప్రతిపక్ష నాయకులను కలిశారని, వారి ప్రోద్బలంతోనే తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాం టి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
డీకే శివకుమార్పై బృహత్ బెంగళూర్ మహానగర పాలిక కాంట్రాక్టర్ల ఆరోపణలపై న్యూస్-18 చానల్ కథనం వీడియోను జత చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదే ‘స్యాం‘గ్రెస్ అసలు రంగు అని ఆయన చురక అంటించారు.