Karnataka | బెంగళూరు, ఫిబ్రవరి 29: లోక్సభ ఎన్నికల ముందు కర్ణాటకలో కులగణన నివేదిక సీఎం సిద్ధరామయ్య చేతికి అందింది. సర్వే రిపోర్ట్ను ఓబీసీ కమిషన్ చైర్మన్ జైప్రకాశ్ హెగ్డే గురువారం సీఎంకు సమర్పించారు. సర్వే నివేదికలోని అంశాలు ఇంకా బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ ఈ నివేదిక రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచనుంది. తన పదవీ కాలానికి చివరి రోజైన గురువారం ఓబీసీ కమిషన్ చైర్మన్ హెగ్డే మధ్యాహ్నం బెంగళూరులోని విధానసౌధకు వచ్చారు.
సీఎం సిద్ధరామయ్యను కలిసి కొద్దిసేపు ముచ్చటించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ నివేదిక సమర్పించినట్టు చెప్పారు. దాన్ని క్యాబినెట్లో ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పినట్టు హెగ్డే వెల్లడించారు. రాష్ట్రంలో రాజకీయంగా ఆధిపత్య కులాలైన లింగాయత్, వొక్కలిగ కులాలు సర్వే నివేదికను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. నివేదిక అశాస్త్రీయంగా ఉన్నట్టు ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వొక్కలిగ కులానికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా గతంలో తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు.