అమ్మ కాటికి.. నాన్న కటకటాల్లోకి
తల్లి మృతదేహం వద్ద దీనంగా చిన్నారులు
చేరదీసేందుకు ముందుకురాని బంధువులు
కరీంనగర్ జిల్లా రాంపూర్లో విషాదం
హుజూరాబాద్, మార్చి 28: ‘అమ్మా లేమ్మా.. ఆకలవుతుందమ్మా’ అంటూ వచ్చీరాని మాటలతో తల్లి శవం వద్ద ఆ పిల్లాడి పిలుపు.. గుక్కెడు పాల కోసం ఐదు నెలల పసికందు గుక్కపట్టి ఏడుస్తున్న తీరు చూపరులను కన్నీరు పెట్టించింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ దవాఖాన మార్చురీ వద్ద చోటుచేసుకున్న ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. మానకొండూరు మండలం చెం జర్లకు చెందిన వాసాల రమ-సత్యనారాయణల కూతురు మౌనికకు హుజురాబాద్ మండలం రాంపూర్కు చెందిన ధనుంజయ్తో మూడేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర వయసున్న బాబు, ఐదు నెలల పాప ఉన్నారు.
శనివారం మౌనిక బలవన్మరణానికి పాల్పడింది. అత్తింటివారే చంపారని మౌనిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ధనుంజయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మౌనిక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం హుజూరాబాద్ దవాఖానకు తరలించారు. తల్లి కానరాని లోకాలకు, తండ్రి కటకటాల్లోకి వెళ్లడంతో ఆ పసివాళ్లు దిక్కులేనివారయ్యారు. చిన్నారులను తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. పోలీసుల కౌన్సెలింగ్తో అమ్మమ్మ, తాత ఆ పిల్లలను తీసుకెళ్లారు.