జగిత్యాల, మార్చి 10: పారిశుధ్య నిర్వహణలో ముందున్న పాఠశాలలకు కేంద్ర సర్కారు ‘స్వచ్ఛ విద్యాలయ్’ పేరిట పురస్కారాన్ని అందిస్తున్నది. 2017లో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం కరోనా కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయింది. ఈ యేడు పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఈ సంవత్సరం నుంచి పురస్కారాలు అందించనున్నది. జాతీయస్థాయికి ఎంపికైన స్కూళ్లకు రూ. 60వేల ప్రోత్సాహకాన్ని అందించనున్నది. జిల్లాలో 783కి పైగా ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ, ఆదర్శ, ప్రైవేటు పాఠశాలలు న్నాయి. తెలంగాణ ప్రభుత్వ కృషి, దాతల సహకారంతో పలు ప్రభుత్వ బడులు ప్రైవేట్కు దీటుగా రూపొందాయి. ఈ నేపథ్యంలో పలు స్కూళ్లు జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికయ్యే అవకాశం ఉన్నదని జిల్లా విద్యాధికారులు చెబుతున్నారు.
ఇది మంచి అవకాశం
స్వచ్ఛ విద్యాలయ్ పురస్కారాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆయా పాఠశాలలకు చేరవేశాం. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చొరవ చూపి వివరాలను సంబంధిత యాప్లో నమోదు చేయాలి. ఫొటోలను నిక్షిప్తం చేయాలి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
– జగన్మోహన్రెడ్డి, జగిత్యాల జిల్లా విద్యాధికారి
యాప్లో నమోదు…
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా అందజేస్తున్న ఈ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ‘స్వచ్ఛ విద్యాలయ్ పురస్కార్’ అనే మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో పాఠశాల పేరును రిజిస్టర్ చేసుకుని యూడైస్ కోడ్, పాస్వర్డ్తో లాగిన్ కావాలి. ఇందులోని 39 ప్రశ్నలను పూరించి, సంబంధిత ఫొటోలను అప్లోడ్ చేయాలి. ఈ వివరాల ఆధారంగా అధికారులు స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. నీటి వసతికి 22 మార్కులు, మరుగుదొడ్లకు 27, చేతుల శుభ్రతకు 14, నిర్వహణకు 21, విద్యార్థుల సత్ప్రవర్తన, అవగాహనకు 11, కొవిడ్ జాగ్రత్తలకు 15, ఇలా మొత్తం 110 మార్కులు కేటాయించారు. 90 శాతానికి పైగా మార్కులు వస్తే 5 స్టార్ రేటింగ్, 75 శాతానికి పైగా 4 స్టార్ రేటింగ్ ఇస్తారు. ఇందులో 5 స్టార్ రేటింగ్ దక్కించుకున్న వాటికి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందజేస్తారు. జాతీయ స్థాయికి ఎంపికైన పాఠశాలలకు రూ.60వేల నజరానా కూడా అందించనున్నారు.